IND vs AUS 2nd ODI : విశాఖ వన్డేలో ఆసీస్‌ విశ్వరూపం.. 11 ఓవర్లలోనే ముగించేశారు!

విశాఖపట్నం (Vizag ODI) వన్డేలో అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ టీమ్‌ ఇండియా (Team India) ఘోర వైఫల్యం చెందింది. దీంతో రెండో వన్డేలో ఆసీస్‌ ఘన విజయాన్ని నమోదు చేసింది.

Updated : 19 Mar 2023 18:19 IST

విశాఖపట్నం: ఆస్ట్రేలియా(Australia) పేస్‌ ధాటికి సగం ఓవర్లు ఆడేందుకూ టీమ్‌ఇండియా(Team India) కష్టపడిన పిచ్‌పైనే ఆసీస్‌ విశ్వరూపం చూపించింది. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డే(IND vs AUS)లో రోహిత్‌ సేన విధించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది. సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగుతూ వికెట్‌ పడకుండా ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (51*), మార్ష్‌ (66*) పని పూర్తి చేశారు. ఈ విజయంతో ఆసీస్‌ 1-1తో సిరీస్‌ను సమం చేసి టైటిల్‌ రేసులో నిలిచింది. ఇక చెన్నై వేదికగా జరిగే చివరిదైన మూడో మ్యాచ్‌ సిరీస్‌ విజేతను తేల్చనుంది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 117 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ స్టార్క్‌, సీన్‌ అబాట్‌, ఎల్లీస్‌ పేస్‌ అటాక్‌ ముందు భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ వెలవెలబోయింది. విరాట్‌ కోహ్లీ (31), అక్షర్‌ పటేల్‌ (29) ఆ కాస్త రాణించడంతో.. భారత్‌ స్కోరు వంద పరుగులైనా దాటగలిగింది. శుబ్‌మన్‌ గిల్‌, సూర్య కుమార్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌ డకౌట్లు కాగా.. కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 5 వికెట్లతో విజృంభించగా.. సీన్‌ అబాట్‌ 3, ఎల్లీస్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

మరికొన్ని వివరాలు:

* మిచెల్‌ మార్ష్ భారత్‌పై వన్డేల్లో 122.44 స్ట్రైక్‌రేట్‌తో  311 పరుగులు సాధించాడు. 103.66 సగటుతో కొనసాగుతున్నాడు. 

* అత్యంత వేగవంతమైన ఆసీస్ లక్ష్య ఛేదనలో ఇది మూడో మ్యాచ్‌. ఇంతకుముందు యూఎస్‌ఏపై 66/1 (7.5 ఓవర్లు), వెస్టిండీస్‌పై 71/1 (9.2 ఓవర్లు) ఆసీస్‌ విజయం సాధించింది. 

* కేవలం 37 ఓవర్లలోనే మ్యాచ్‌ ముగియడం గమనార్హం. సెంచరీ భాగస్వామ్యంలో అత్యధిక రన్‌రేట్‌ కలిగిన మూడో మ్యాచ్‌ కూడా ఇదే. ట్రావిస్ హెడ్ - మిచెల్‌ మార్ష్ 66 బంతుల్లో 121 పరుగులు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని