భారత బౌలర్లు శభాష్‌: మెక్‌గ్రాత్‌

తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ను అడ్డుకోవడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారని ఆ జట్టు మాజీ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ప్రశంసించాడు...

Published : 07 Jan 2021 14:50 IST

సిడ్నీ: తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ను అడ్డుకోవడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారని ఆ జట్టు మాజీ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ప్రశంసించాడు. అయితే, స్మిత్‌ 20, 30 పరుగులు చేశాడంటే నిలువరించడం కష్టమని చెప్పాడు. అడిలైడ్‌ టెస్టులో స్మిత్‌ 1, 1* పరుగులు చేయగా మెల్‌బోర్న్‌లో 0, 8 పరుగులకే ఔటయ్యాడు. దీంతో భారత బౌలర్లు అతడిని కట్టడి చేసే విషయంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని మాజీ పేసర్‌ పేర్కొన్నాడు.

‘స్మిత్‌ను అడ్డుకోవడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారు. ఆ ప్రణాళిక చాలా ఆసక్తిగా ఉండడంతో పాటు ఇప్పటి వరకూ ఫలించింది. యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ కూడా ఇలాగే ప్రయత్నించి విఫలమైంది. స్మిత్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు టీమ్‌ఇండియా లెగ్‌గల్లీలో ఫీల్డర్‌ను ఉంచి ఫలితం సాధించింది. అయితే, అతడు ఒక్కసారి కుదురుకున్నాడంటే ఆపడం చాలా కష్టం. పిచ్‌ను అర్థం చేసుకుంటే పెద్ద స్కోర్లు సాధిస్తాడు. ఇక ఈ సిరీస్‌లో అశ్విన్ చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. పలుమార్లు స్మిత్‌ను ఔట్‌ చేశాడు’ అని మెక్‌గ్రాత్‌ వివరించాడు. 

ఇక తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 36 పరుగులకే ఆలౌటై.. ఘోర పరాజయం చూడడంతో సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తుందని అనుకున్నట్లు మెక్‌గ్రాత్‌ చెప్పాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పితృత్వపు సెలవుల మీద భారత్‌కు తిరిగి వచ్చాక టీమ్‌ఇండియా అద్భుతంగా పుంజుకుందని మెచ్చుకున్నాడు. తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని, అతడి సారథ్యంలో భారత ఆటగాళ్లు బాగా ఆడారన్నాడు. దీంతో మెల్‌బోర్న్‌లో మ్యాచ్‌ గెలిచి సిరీస్‌లో సమానంగా నిలిచారని కొనియాడాడు.

ఇవీ చదవండి..
జాతీయ గీతం ఆలపిస్తూ సిరాజ్‌ కంటతడి..
డేవిడ్‌ వార్నర్‌ నాలుగేళ్లలో ఇలా తొలిసారి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని