Djokovic - Rafael Nadal : ఆటగాళ్ల కన్నా ఆస్ట్రేలియా ఓపెనే ముఖ్యం : రఫేల్ నాదల్‌

సెర్బియా ఆటగాడు, ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారుడు నోవాక్‌ జకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనకుండా నిషేధం విధించడంపై ఆటగాళ్ల నుంచి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి....

Published : 15 Jan 2022 11:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : సెర్బియా ఆటగాడు, ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారుడు నోవాక్‌ జకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనకుండా నిషేధం విధించడంపై ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన స్పెయిన్ ఆటగాడు రఫేల్ నాదల్.. ‘ఆటగాళ్ల కన్నా ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహణే చాలా ముఖ్యమైనది. జకోవిచ్ ఆడినా, ఆడకపోయినా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గొప్పగా సాగుతుంది. జకోవిచ్‌ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించనప్పటికీ.. ఒక వ్యక్తిగా, గొప్ప టెన్నిస్ క్రీడాకారుడిగా అతడిని ఎప్పుడూ గౌరవిస్తాను. దాదాపు రెండు వారాలుగా సాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలికి.. ఆటపై దృష్టి పెట్టాల్సి ఉంది’ అని నాదల్ అన్నాడు.

ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా ఓపెన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నవోమి ఒసాకా కూడా ఈ వివాదంపై స్పందించింది. జకోవిచ్ లాంటి దిగ్గజ ఆటగాడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనకుండా నిషేధం విధించడం దురదృష్టకరమని పేర్కొంది. ‘జకోవిచ్‌ సొంత నిబంధనల ప్రకారం ఆడాలనుకుంటున్నాడు. గత రెండు వారాలుగా ఎక్కడ చూసినా అతడికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. చాలా మంది టెన్నిస్‌ను పక్కన పెట్టి జకోవిచ్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. అందుకే, నేను టెన్నిస్‌ గురించి మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను’ అని గ్రీక్‌ టెన్నిస్ స్టార్‌ స్టెఫానోస్‌ సిట్సిపాస్ విమర్శించాడు.

‘ఈ వివాదం ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బ తీస్తోంది. కరోనా కారణంగా ఆస్ట్రేలియా పౌరులు ఇప్పటికే చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. అందుకే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే ప్రతి ఒక్క ఆటగాడు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందే’ అని ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్‌ పేర్కొన్నాడు. ‘చాలా రోజులుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఇది టెన్నిస్‌కు గానీ, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు గానీ అంత మంచిది కాదు. వ్యక్తిగతంగా జకోవిచ్‌కు కూడా మేలు చేకూర్చేది కాదు’ అని ఆండీ ముర్రే అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని