IND vs PAK in Asia Cup 2023: ఎప్పుడూ పోటాపోటీగానే పోరు.. మేం కోరుకొనేదీ అలాంటిదే: బాబర్ అజామ్‌

దాయాదుల పోరు ఏ స్థాయిలోనైనా చూసేందుకు ఆసక్తికరంగానే ఉంటుంది. ఇటీవల ఎమర్జింగ్‌ ఆసియా కప్‌లో రెండుసార్లు భారత్ - పాక్‌ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో సీనియర్ ఆసియా కప్‌లో (Asia Cup 2023) భాగంగా జట్ల మధ్య పోటీ జరగనుంది.

Published : 27 Aug 2023 12:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మూడే రోజుల్లో ఆసియా కప్‌ (Asia Cup 2023) ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ (Team India) తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తోంది. మరోవైపు పాకిస్థాన్‌ కూడా అఫ్గానిస్థాన్‌తో శ్రీలంక వేదికగానే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి జోరు మీదుంది. ఆగస్టు 30న ఆసియా కప్‌ మొదలుకానున్న సంగతి తెలిసిందే. భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది. ఈ క్రమంలో దాయాదుల పోరు ఎలా ఉంటుందనే దానిపై పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ స్పందించాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తరంగానే ఉంటుందని వ్యాఖ్యానించాడు.

పెద్ద టోర్నీల్లో డెబ్యూ వద్దు.. వారిద్దరికీ చోటు లేదు.. సచిన్-ధోనీ సమానమే!

‘‘భారత్- పాకిస్థాన్‌ మ్యాచ్‌ను ప్రపంచమంతా ఆసక్తికరంగా చూస్తుంది. ఎప్పుడూ పోటీ తీవ్రంగానే ఉంటుంది. క్రికెట్ అభిమానులతోపాటు మేం కూడా ఎంజాయ్ చేస్తాం. దాయాదుల మధ్య పోరును అభిమానులు ఎప్పుడూ మిస్ కాలేరు. ఇరు జట్ల ఆటగాళ్లూ వంద శాతం ప్రయత్నించి విజయం కోసం పోరాడతారు’’ అని బాబర్ తెలిపాడు. 

మ్యాచ్‌లోనే తేలుతుంది: షాదాబ్‌ ఖాన్‌

ఆసియా కప్‌ జట్టును ప్రకటించిన అనంతరం క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ పేస్‌ బౌలింగ్‌ను విరాట్ కోహ్లీ హ్యాండిల్‌ చేయగలడని వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్‌ 2022 టోర్నీలోనూ పాకిస్థాన్‌పై గెలవడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. తాజాగా అజిత్ అగర్కార్ వ్యాఖ్యలపై పాక్ ఆటగాడు షాదాబ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఎవరు పైచేయి సాధిస్తారనేది మ్యాచ్‌ రోజునే తెలుస్తుంది. మా నుంచైనా.. వారి నుంచైనా గెలవాలనే కోరుకుంటారు. అందులో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. బరిలోకి దిగినప్పుడే అసలైన సత్తా బయటకొస్తుంది’’ అని వ్యాఖ్యానించాడు. 

అగ్రస్థానంలోకి పాకిస్థాన్ జట్టు

ఆసియా కప్‌ ప్రారంభానికి ముందు ఐసీసీ ర్యాంకులు విడుదలయ్యాయి. జట్ల పరంగా వన్డేల్లో పాకిస్థాన్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అఫ్గాన్‌పై మూడు వన్డేల సిరీస్‌ను నెగ్గడం కలిసొచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ 118 పాయింట్లతో ఉండగా.. ఆస్ట్రేలియా కూడా 119 పాయింట్లతో ఉన్నప్పటికీ రెండో స్థానంలో నిలిచింది. ఇక భారత్ 113 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఆసియా కప్‌లో ప్రదర్శన ఆధారంగా జట్ల ర్యాంకులు మారే అవకాశం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు