RCB: బెంగళూరు జట్టుకు షాక్‌.. అప్పటి వరకు కీలక ఆల్‌రౌండర్‌ దూరం!

కీలక ఆటగాళ్ల గైర్హాజరీతోనే ఆర్‌సీబీ (RCB) తన తొలి మ్యాచ్‌లో ముంబయితో తలపడేందుకు సిద్ధమవుతోంది. హేజిల్‌వుడ్‌ ఇప్పటికే దూరం కాగా.. తాజాగా ఆల్‌రౌండర్‌ హసరంగ కూడా అందుబాటులో ఉండడని ఆర్‌సీబీ జట్టు ప్రధాన కోచ్‌ సంజయ్‌ బంగర్‌ తెలిపాడు.

Updated : 02 Apr 2023 10:44 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్‌ బౌలర్‌ జోష్ హేజిల్‌వుడ్ కొన్ని మ్యాచ్‌లకు దూరమవగా.. తాజాగా టాప్‌ ఆల్‌రౌండర్‌ వహిందు హసరంగ కూడా అదే బాట పట్టాడు. అంతర్జాతీయ షెడ్యూలింగ్ కారణంగా ఐపీఎల్‌కు అతడు దూరం కావడం ఆర్‌సీబీకి ఇబ్బందిగా మారింది. ఏప్రిల్ 9 వరకు అందుబాటులో ఉండటం కష్టమని ఆర్‌సీబీ ప్రధాన కోచ్‌ సంజయ్‌ బంగర్ తెలిపాడు. ఇవాళ ముంబయితో బెంగళూరు తొలి  మ్యాచ్‌ ఆడనుంది. హేజిల్‌వుడ్ స్థానంలో ఇంగ్లాండ్ పేసర్ రీస్‌ టోప్లేను తీసుకున్నట్లు బంగర్‌ వెల్లడించాడు. 

యువ బ్యాటర్ రజత్ పటీదార్ కూడా సగం మ్యాచ్‌లను ఆడకపోవచ్చని.. అతడి గాయంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు సంజయ్‌ బంగర్ తెలిపాడు. అయితే, ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ ముంబయితో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ స్థానంలో కివీస్‌ ఆటగాడు బ్రాస్‌వెల్‌ను తీసుకుంటున్నట్లు చెప్పాడు. సొంత మైదానంలో ఆడేందుకు ఆటగాళ్లంతా ఉత్సాహంతో ఉన్నారని బంగర్‌ తెలిపాడు.

ఫాఫ్‌ డుప్లెసిస్‌ నాయకత్వంలో విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్, ఫిన్ అలెన్, సిరాజ్‌ వంటి కీలక ఆటగాళ్లతో టైటిల్‌ గెలిచే దిశగా సాగాలని ఆర్‌సీబీ అభిమానులు ఆశిస్తున్నారు. గతేడాది ప్లేఆఫ్స్‌ చేరిన బెంగళూరు.. రాజస్థాన్‌ రాయల్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ ఫామ్‌ కొనసాగిస్తే మాత్రం బెంగళూరుకు తిరుగుండదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని