BAN VS ZIM: బంగ్లా టైగర్స్‌ను బెంబేలెత్తిస్తోన్న జింబాబ్వే..! 9 ఏళ్ల తర్వాత తొలిసారి!

బంగ్లాదేశ్‌కు జింబాబ్వే పర్యటనలో ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి

Published : 07 Aug 2022 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగ్లాదేశ్‌కు జింబాబ్వే పర్యటనలో ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన బంగ్లా.. వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ను సైతం ఓడిపోయింది. హరారే వేదికగా ఈ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 303 పరుగులు చేసింది. అయినా, ఈ స్కోరు జింబాబ్వే బ్యాటర్లకు సరిపోలేదు. సికందర్ రజా, ఇన్నోసెంట్ కైయా అద్భుతమైన సెంచరీలతో 48.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి బంగ్లాకు షాక్‌ ఇచ్చారు. తొలుత బంగ్లా టాప్‌ 4 బ్యాటర్లు తమీమ్ ఇక్బాల్  లిట్టన్ దాస్, అనాముల్ హక్ , ముష్ఫికర్ రహీమ్ అర్ధశతకాలు సాధించడం విశేషం. మరోవైపు జింబాబ్వే ఛేదనలో 62 పరుగులకే 3 టాప్‌ఆర్డర్‌ వికెట్లు కోల్పోయింది. అయితే సికందర్ రజా (135 నాటౌట్‌,109 బంతుల్లో; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత శతకం, కైయా (110) కలిసి జింబాబ్వేకు గొప్ప విజయాన్ని అందించారు.

ఈ మ్యాచ్‌లో కొన్ని ఆసక్తికర రికార్డులు..!

* ఒక జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి, మ్యాచ్‌ ఓడిపోవడం వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇది నాలుగోసారి. ఇంతకముందు పాక్‌, విండీస్‌, సఫారీ జట్లు ఈ విధంగానే  పరాజయం చెందాయి.
* వన్డేల్లో జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్‌పై తొమ్మిదేళ్ల తర్వాత గెలుపొందింది. అంతేకాదు.. ఇంతకముందు బంగ్లాదేశ్‌తో వరుసగా 19 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన జింబాబ్వే.. ఈ మ్యాచ్‌తో ఆ చెత్త రికార్డుకు బ్రేక్‌ వేసింది.
* బంగ్లాపై 2017 తర్వాత 300+ పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే మాత్రమే ఛేదించింది. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం 2017 తర్వాత జింబాబ్వేకు కూడా ఇదే తొలిసారి.
* జింబాబ్వే తరుఫున నాలుగో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రజా, కైయా 25 ఏళ్ల తర్వాత అత్యధిక పరుగులు సాధించిన జోడీగా నిలిచారు. ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన రెండో జింబాబ్వే జోడీగా వీరిద్దరూ మరో రికార్డు సృష్టించారు.
* బంగ్లా సారథి తమీమ్‌ ఇక్బాల్  ఈ మ్యాచ్‌లో 8000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ ఈ మ్యాచ్‌తోనే 5000 పరుగుల మార్క్‌ను చేరుకొన్నాడు.

బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ గెలవడం కూడా జింబాబ్వేకు ఇదే తొలిసారి కావడం గమనార్హం.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని