T20 World Cup: ఆరంభంలో తడబడినా.. రాణించిన విండీస్‌

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచులో.. విండీస్‌ జట్టు ఆరంభంలో తడబడినా ఆఖర్లో రాణించింది. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి వెస్టిండీస్..

Updated : 29 Oct 2021 17:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచులో.. విండీస్‌ జట్టు ఆరంభంలో తడబడినా ఆఖర్లో రాణించింది. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ కష్టాల్లో పడింది. అయితే, అరంగేట్ర ఆటగాడు రోస్టన్ ఛేజ్‌ (39), ఆఖర్లో వచ్చిన నికోలస్‌ పూరన్ (40) ధాటిగా ఆడారు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ ముందు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహెదీ హసన్‌, షొరిఫుల్‌ ఇస్లాం, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ రెండేసి వికెట్లు తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్‌ జట్టు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌ (6), క్రిస్ గేల్‌ (4) ఘోరంగా విఫలమయ్యారు. మూడో ఓవర్లో లూయిస్‌ క్యాచ్‌ ఔట్‌ కాగా.. ఐదో ఓవర్లో గేల్ బౌల్డయ్యాడు. దీంతో పవర్‌ ప్లే (6 ఓవర్లు) పూర్తయ్యే సరికి వెస్టిండీస్‌ స్కోరు 29/2గా ఉంది. ఆ తర్వాత బ్యాటింగ్‌ వచ్చిన షిమ్రోన్‌ హెట్ మైర్‌ (9) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆండ్రూ రస్సెల్‌ (0), డ్వేన్‌ బ్రావో (1) కూడా రాణించలేదు. తర్వాత వచ్చిన రోస్టన్ ఛేజ్‌, నికోలస్‌ పూరన్‌ ధాటిగా ఆడారు. అయితే, వీరిద్దరినీ షొరిఫుల్‌ ఇస్లామ్‌ 19వ ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చాడు. ముస్తాఫిజుర్‌ వేసిన ఆఖరి ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి డ్వేన్ బ్రావో (1) సౌమ్యసర్కార్‌కి చిక్కాడు. తర్వాత జేసన్‌ హోల్డర్‌ (15 ) వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. నాలుగో బంతికి ఒక పరుగు వచ్చింది.  చివరి బంతికి పొలార్డ్‌ (14) సిక్స్‌ బాదాడు. హోల్డర్, పొలార్డ్ నాటౌట్‌గా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని