IND vs AUS: అందుకే.. ఆ ముగ్గురికి విశ్రాంతి ఇచ్చాం: అజిత్ అగార్కర్

సెప్టెంబర్‌ 22 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ (IND vs AUS) మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. వన్డే వరల్డ్‌ కప్‌ ముందు టీమ్‌ఇండియా ఆడనున్న చివరి సిరీస్‌. దీంతో సర్వత్రా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Updated : 19 Sep 2023 18:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ బరిలోకి దిగేముందు ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా (IND  vs AUS) చివరి వన్డే సిరీస్‌ను ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లను ప్రకటించడం జరగింది. అనూహ్యంగా భారత జట్టులోకి అశ్విన్‌ రాగా.. టాప్‌ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యకు రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. వారితోపాటు కుల్‌దీప్‌ను తొలి రెండు వన్డేలకు ఎంపిక చేయలేదు. అయితే, చివరి మ్యాచ్‌కు మాత్రం అందరూ అందుబాటులో ఉంటారు. ఈ క్రమంలో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంపై చీఫ్‌ సెలెక్టర్ అజిత్‌ అగార్కర్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. 

త్వరలో టీమ్‌ఇండియా ‘భారత్‌ దర్శన్‌’ యాత్రను చేయనుంది. స్వదేశంలోని వివిధ పిచ్‌లపై వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను భారత్‌ ఆడనుంది. ఇలాంటి సమయంలో జరగనున్న ఆసీస్‌ మ్యాచ్‌లకు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం అవసరమా..?అని అజిత్‌ అగార్కర్‌ను సదరు జర్నలిస్ట్‌ అడిగారు. 

ఆసీస్‌తో వన్డే సిరీస్.. టీమ్‌ఇండియాలోకి రవిచంద్రన్ అశ్విన్

‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు హార్దిక్‌ పాండ్య మాకు చాలా కీలకం. వారికి తగినంత విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆసియా కప్‌లో కావాల్సినంత ప్రాక్టీస్‌ వారికి దొరికింది. కుల్‌దీప్‌ కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. దీంతో వీరందరికి విశ్రాంతి ఇచ్చి జట్టులోని మిగతా ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్నదే మా లక్ష్యం. ఇప్పుడు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకపోతే.. సుదీర్ఘంగా జరగనున్న వరల్డ్‌ కప్‌లో ఏదొక దశకు చేరుకున్నాక మానసికంగా లేదా శారీరకంగా అలసిపోతారు. అప్పుడు పక్కన పెట్టడం చాలా ఇబ్బంది. అందుకే, ఇలాంటి బ్రేక్‌ ఇవ్వడం వల్ల తాజాగా మెగా టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆసీస్‌తో మూడో వన్డేలో వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగే జట్టు ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో మాత్రం రిజర్వ్‌ బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాం’’ అని అగార్కర్ వెల్లడించాడు.

మియా వెనుక భయ్యా... సిరాజ్‌ను దిద్దిన విరాట్‌ కోహ్లి

ఈ వరల్డ్ కప్ భారత్‌లోనే జరగనున్న సంగతి తెలిసిందే. మరే జట్టు కూడా టీమ్‌ఇండియాలా దేశంలోని ఎక్కువ మైదానాల్లో మ్యాచ్‌లు ఆడటం లేదు. ప్రపంచకప్‌ మ్యాచ్‌లు మొత్తం 10 మైదానాల్లో జరగనుండగా.. హైదరాబాద్‌ మినహా మిగతా అన్నింట్లోనూ భారత్‌ ఒక్కో మ్యాచ్‌ ఆడనుండటం గమనార్హం. అందుకే, టీమ్‌ఇండియా ప్రయాణాన్ని ‘భారత్‌ దర్శన్’గా క్రికెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని