IPL 2022: భారత్‌లోనే ఐపీఎల్‌ 2022..తొలి ప్రాధాన్యత ఇక్కడే..!

ఈ ఏడాది వేసవిలో నిర్వహించే ఐపీఎల్‌ 15వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని, విదేశాల్లో నిర్వహించడాన్ని ఇచ్ఛికగా ఉంచుకుందని ఈ వ్యవహారాలకు సంబంధించి...

Published : 09 Jan 2022 13:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది వేసవిలో నిర్వహించే ఐపీఎల్‌ 15వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని, విదేశాల్లో నిర్వహించడాన్ని ఆప్షన్‌గా ఉంచుకుందని ఈ వ్యవహారాలకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి తాజాగా జాతీయ మీడియాకు వెల్లడించారు. భారత్‌లో రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో టోర్నీ నిర్వహణ ఇక్కడ కష్టంగా మారితే.. ప్రత్యామ్నాయంగా విదేశీ వేదికలను సైతం ఎంచుకునే వీలుందని ఆయన వివరించారు. అంతకంటే ముందు ఐపీఎల్‌ మెగా వేలంపైనే బీసీసీఐ ప్రధానంగా దృష్టిసారించిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఇప్పటికైతే ఇంకా ఎలాంటి వేదికలను ఖరారు చేయలేదని ఆయన అన్నారు. ఇక ఈ టోర్నీ షెడ్యూల్‌ ప్రకటించకపోయినా ఏప్రిల్ తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది కొత్తగా రెండు జట్లు మెగా ఈవెంట్‌లో పాలుపంచుకుంటుండగా ఆటగాళ్ల వేలం ఆలస్యం కానుంది. దీన్ని ఫిబ్రవరి తొలివారంలో నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ టోర్నీ జరిగే సమయానికి కేసులు అధికమైతే ఏం చేస్తారనే విషయాన్ని ప్రస్తావించగా.. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకుంటామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అవసరమైతే విదేశాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని అధికారి స్పష్టం చేశారు. కానీ, తొలి ప్రాధాన్యత మాత్రం భారత్‌లోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని