Ganguly : ఇటీవల కాలంలో టీమ్ఇండియా అత్యంత పేలవ ప్రదర్శన అదే: గంగూలీ

 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యంపై బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్‌ఇండియా మాజీ సారథి 

Published : 06 Dec 2021 01:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యంపై బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ ఓ చర్చా కార్యక్రమం సందర్భంగా స్పందించాడు.  ‘‘గత నాలుగైదేళ్లలో నేను చూసిన టీమ్ఇండియా ప్రదర్శనల్లో ఇదే అత్యంత పేలవంగా ఉంది’’ అని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లపై ఓటమిపాలైన భారత్‌.. మిగతా మూడు మ్యాచ్‌లు (అఫ్గాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌) గెలిచినా నాకౌట్‌ దశకు చేరుకోలేకపోయింది. అంతేకాకుండా తొలిసారి ప్రపంచకప్‌ టోర్నీల్లో పాక్‌ చేతిలో ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో టీమ్‌ఇండియా మంచి ప్రదర్శన చేసిందని, అయితే 2021 టీ20 ప్రపంచకప్‌లో మాత్రం తన స్థాయి ఆటను ఆడలేదని గంగూలీ వివరించాడు. 

‘‘ నిజాయితీగా చెప్పాలంటే నాలుగేళ్ల నుంచి టీమ్‌ఇండియా  చాలా బాగా ఆడుతోంది. 2017, 2019 ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా పోరాడింది. 2017 ఛాంపియన్స్‌ టోఫ్రీ ఫైనల్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయింది. అలానే వన్డే ప్రపంచకప్‌లోనూ సెమీస్‌ వరకు చాలా బాగా ఆడాం. అక్కడ కివీస్‌పై బోల్తాపడ్డాం. అయితే ఆ రెండు టోర్నీల్లోనూ భారత్‌ పోరాడి ఓడింది. అయితే 2021 టీ20 ప్రపంచకప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా తొలి రెండు మ్యాచుల్లో కనీస పోరాటం చేయలేదు. గత నాలుగైదేళ్లుగా నేను చూసిన ప్రదర్శనల్లో ఇదే బాగోలేనిది’’ అని సౌరభ్‌ గంగూలీ తెలిపాడు.  

పాక్‌పై పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన టీమ్‌ఇండియా.. కివీస్‌ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పాక్‌తో మ్యాచ్‌లో ఒత్తిడికి గురైన భారత్‌ కనీసం పోరాటం కూడా చేయలేకపోయింది. దీనిపై గంగూలీ స్పందిస్తూ.. ‘‘ఈ ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారని భావిస్తున్న. కారణం మాత్రం ఏంటో తెలియదు. అయితే పెద్ద టోర్నీల్లో కొన్నిసార్లు ఇలా అవుతుంది. పాక్‌, కివీస్‌ మీద టీమ్‌ఇండియా ఆటను చూస్తే తమ సామర్థ్యంలో పదిహేను శాతం మాత్రమే ఆడినట్లు అనిపించింది. అయితే ఇలా ఎందుకు జరిగిందని కొన్నిసార్లు కారణాలను వేలెత్తి చూపలేరు’’ అని విశ్లేషించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని