Rishabh Pant: రిషభ్‌ పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ప్రకటన

రిషభ్‌  పంత్ రోడ్డు ప్రమాదానికి గురికావడం క్రికెట్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే  ఆ గాయాలు తీవ్రమైనవి కాకపోవడంతో ఊపిరి పీల్చుకొన్నారు. పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

Published : 30 Dec 2022 13:32 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా యువ బ్యాటర్ రిషభ్‌ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం దిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా దిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. తాజాగా పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. పంత్‌ నుదురు చిట్లినట్లు, వీపుపై కాలిన గాయాలు, కుడి మోకాలి లిగ్మెంట్‌ స్థానభ్రంశమైనట్లు ఎక్స్‌రేల్లో తెలిసినట్లు పేర్కొంది. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు బీసీసీఐ తెలిపింది.

పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇతర స్కాన్‌ల కోసం ట్రీట్‌మెంట్ జరుగుతోందని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. అలాగే పంత్ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడినట్లు పేర్కొన్నారు. ‘‘రిషభ్‌ పంత్ త్వరగా కోలుకొని రావాలని ప్రార్థిస్తున్నా. ఇప్పటికే పంత్ కుటుంబ సభ్యులతో మాట్లాడా. వైద్యులతో కూడా సంప్రదింపులు జరిపా. రిషభ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మరికొన్ని వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అతడి పరిస్థితిని సునిశతంగా పరిశీలిస్తున్నాం. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సంసిద్ధంగా ఉన్నాం’’ అని షా ట్వీట్ చేశారు. 

ఖర్చంతా భరిస్తాం: ఉత్తరాఖండ్ సీఎం

పంత్‌ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. అంతకుముందు పంత్‌కు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ ఆశిష్ యాగ్నిక్ మాట్లాడుతూ.. ‘పంత్‌కు చిన్నపాటి గాయాలు తగిలాయి. నడుము భాగంలో అయిన గాయాలకు చికిత్స అందిస్తున్నాం. పంత్‌ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు’ అని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో కారులో పంత్‌ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ స్పష్టం చేశారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడని.. దీంతో వాహనంలో మంటలు చెలరేగినట్లు డీజీపీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని