IPL Playoffs: ఒక్కో డాట్‌ బాల్‌కు 500 మొక్కలు.. మొత్తం ఎన్ని మొక్కలు నాటబోతున్నారంటే?

పర్యావరణ పరిరక్షణ భాగంగా ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ (Playoffs)​లో నమోదైన ఒక్కో డాట్​ బాల్​కు 500 చెట్లు నాటుతామని బీసీసీఐ (BCCI) ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ప్లేఆఫ్స్‌లో ఎన్ని డాట్ బాల్స్‌ నమోదయ్యాయి.. బీసీసీఐ ఎన్ని మొక్కలు నాటబోతుందో తెలుసుకుందాం.

Published : 31 May 2023 16:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ, మనలో చాలామంది పర్యావరణం గురించి పట్టించుకోవడం లేదు. పట్టణీకరణ పేరుతో ఇష్టం వచ్చినట్లు చెట్లు నరికేస్తున్నారు. ఈ పరిస్థితిలో కాస్తయిన మార్పు రావాలనే ఉద్దేశంతో బీసీసీఐ (BCCI) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ (Playoffs)​లో ఒక్కో డాట్​ బాల్​కు 500 చెట్లు నాటుతామని ప్రకటించింది. సోమవారం గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (GT vs CSK) మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌తో ఐపీఎల్-16 సీజన్‌ ముగిసింది. మరి ప్లేఆఫ్స్​లో ఎన్ని డాట్​ బాల్స్​ నమోదయ్యాయి?, ఎన్ని మొక్కలను నాటబోతున్నారో తెలుసుకుందాం. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్-1లో 84 డాట్‌ బాల్స్‌ నమోదయ్యాయి. ముంబయి ఇండియన్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరుజట్ల బౌలర్లు కలిపి 96 డాట్ బాల్స్‌ వేశారు. గుజరాత్, ముంబయి మధ్య జరిగిన క్వాలిఫయర్-2లో 67 డాట్ బాల్స్‌ వేయగా..  చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 45 డాట్‌ బాల్స్‌ నమోదయ్యాయి. ఈ లెక్కన ప్లేఆఫ్స్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లో మొత్తం 292 డాట్‌ బాల్స్‌ నమోదయ్యాయన్నమాట. అంటే 292×500 లెక్కన  బీసీసీఐ మొత్తం 1,46,000 మొక్కలు నాటనుంది. ఈ డాట్‌ బాల్స్‌లో సింహభాగం ఆకాశ్‌ మధ్వాల్, మహ్మద్‌ షమి, రషీద్‌ఖాన్‌, మతీశా పతిరనలదే. 

భారత క్రికెట్ బోర్డు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. భవిష్యత్తులోనూ ఇలానే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఖరి బంతికి విజయం సాధించి ఐదో టైటిల్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని