Yashasvi Jaiswal: నా ఎదుగుదల వెనక వారే కారణం.. : యశస్వి జైస్వాల్‌

తాను ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటానని.. అవకాశం దొరికినప్పుడల్లా దిగ్గజ క్రికెటర్లతో మాట్లాడి ఆటను మెరుగుపరుచుకుంటానని యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal) చెప్పాడు.

Updated : 12 May 2023 15:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  ఇప్పుడు ఎక్కడ చూసినా.. రాజస్థాన్‌ రాయల్స్‌(Rajasthan Royals) ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal) ఆట గురించే చర్చ. ఈ సీజన్‌(IPL 2023)లో అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్న ఈ కుర్రాడు.. గురువారం కోల్‌కతా(KKR vs RR)తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. బ్యాట్‌తో వీరవిహారం చేసి ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ శతకం(Fastest Half Century in Ipl) నమోదు చేశాడు. ఇక ఆటతీరు మెరుగుపరుచుకునేందుకు కోహ్లీ, రోహిత్‌ శర్మ, ధోనీలాంటి దిగ్గజాలే కారణమని తన వినయాన్ని చాటుకున్నాడు.

‘‘నా చుట్టూ ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. నాకు అవకాశం దొరికినప్పుడల్లా ధోనీ భాయ్‌(MS Dhoni), విరాట్‌ భాయ్‌(Virat Kohli), రోహిత్‌ భాయ్‌(Rohit Sharma) సంజూ శాంసన్‌ భాయ్‌(sanju samson), జోస్‌ బట్లర్‌(jos buttler)ల నుంచి నేర్చుకుంటాను. నా మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి.. ఎలా ఆలోచించాలి అనే విషయాల గురించి వారితో మాట్లాడతాను’’

‘నేను ఎప్పుడూ నేర్చుకోవడానికే ప్రయత్నిస్తా. ఎక్కడ మెరుగుపర్చుకోవాలో అక్కడ మెరుగవుతాను. ఎలా కంట్రోల్‌లో ఉండాలో నేర్చుకుంటాను. ఈ ఆట భౌతికం కంటే.. పూర్తిగా మనసుకు సంబంధించింది. ఆ జోన్‌లో ఉండేందుకు మనమెప్పుడూ ప్రయత్నించాలి’ అని జైస్వాల్‌ వివరించాడు.

ఇక యశస్వి జైస్వాల్‌.. దేశవాళీ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో డబుల్‌ సెంచరీ బాది 2019లో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ 2020లో.. బేస్‌ప్రైజ్‌ కంటే 12 రెట్లు అధికంగా వెచ్చించి రాజస్థాన్‌ జట్టు అతడిని సొంతం చేసుకుంది. మొదటి మూడు సీజన్‌లలో పెద్దగా ఆకట్టుకోనప్పటికీ.. ఈ సీజన్‌లో దూసుకుపోతున్నాడు. ఈ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రెండో స్థానంలో(575 పరుగులు) కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజన్‌లో నాలుగుసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్న ఏకైక ఆటగాడిగానూ నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని