ఫుట్‌వర్క్‌లో వేగం పెంచి.. అశ్విన్‌పై ఒత్తిడి పెంచా

వేగవంతమైన ఫుట్‌వర్క్‌తో ముందుగానే దాడికి దిగడం రవిచంద్రన్‌ అశ్విన్‌పై బాగా పనిచేసిందని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. తన వ్యూహంతో అతడిపై ఒత్తిడి తీసుకొచ్చానని తెలిపాడు. మూడు వారాల క్రితమే రెండు శతకాలు బాదిన తనను ఫామ్‌లేనని అనడం నవ్వుతెప్పించిందని పేర్కొన్నాడు....

Published : 08 Jan 2021 17:38 IST

సిడ్నీ: వేగవంతమైన ఫుట్‌వర్క్‌తో ముందుగానే దాడికి దిగడం రవిచంద్రన్‌ అశ్విన్‌పై బాగా పనిచేసిందని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. తన వ్యూహంతో అతడిపై ఒత్తిడి తీసుకొచ్చానని తెలిపాడు. మూడు వారాల క్రితమే రెండు శతకాలు బాదిన తనను ఫామ్‌లో లేనని అనడం నవ్వు తెప్పించిందని పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరికొన్ని పరుగులు చేయాల్సిందని వెల్లడించాడు. శతకం చేసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.

‘మరింత సానుకూలంగా ఉండాలని నిర్ణయించుకున్నా. బౌలింగ్‌కు రాగానే యాష్‌ తల మీదుగా షాట్లు ఆడాను. నాకిష్టమైన చోట బంతులు వేయించేలా అతడిపై ఒత్తిడి పెంచాను. వ్యూహం ఫలించినందుకు, పరుగులు చేసినందుకు ఆనందంగా ఉంది. స్పిన్నర్ల బౌలింగ్‌లోనే వేగంగా కదిలాను. పేసర్లను ఎప్పట్లాగే ఎదుర్కొన్నా. ఈ మ్యాచ్‌లో నేను కాస్త దూకుడుగా ఆడాను. ఆరంభంలో బంతికో పరుగు చొప్పున చేయడంతో మంచి ఇన్నింగ్స్‌ను నిర్మించాను’ అని స్మిత్‌ అన్నాడు.

మూడు వారాల క్రితమే సిడ్నీ మైదానంలో వరుస శతకాలు చేసిన తనను ఫామ్‌ కోల్పోయానని విమర్శించడం నవ్వు తెప్పించిందని స్మిత్‌ తెలిపాడు. కొంతమంది అలాగే ఉంటారని పేర్కొన్నాడు. ‘తొలి రెండు టెస్టుల్లో పరుగులు చేయలేకపోయాను. మూడో టెస్టులో పుంజుకొని శతకం చేయడంతో జట్టు మెరుగైన స్థితిలోనే నిలిచిందని అనుకుంటున్నా. మేం మెరుగైన స్కోరే చేశాం. ఇంకొన్ని పరుగులు చేస్తే బాగుండేది. రెండోరోజు సాయంత్రం బౌలర్లు చక్కగా బంతులు విసిరి రెండు వికెట్లు తీశారు. రేపు ఏం జరుగుతుందో చూడాలి. ఎంసీజీ నాకెంతో ప్రత్యేకమైన మైదానం. ఇక్కడ ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను’ అని స్మిత్‌ చెప్పాడు.

క్వీన్స్‌లాండ్‌లో మూడు రోజుల లాక్‌డౌన్‌ విధించినా గబ్బాలో నాలుగో టెస్టు జరుగుతుందని స్మిత్‌ ధీమా వ్యక్తం చేశాడు. ‘గబ్బాలో టీమ్‌ఇండియాతో తలపడటం మాకిష్టమే. నాకు తెలిసినంత వరకు మార్పులేమీ ఉండకపోవచ్చు. అయితే నిర్ణయం తీసుకొనేది మేం కాదు. బోర్డులు చెప్పిన చోటికి వెళ్లి ఆడటమే ఆటగాళ్ల పని. ఏదేమైనా గబ్బాలో ఆడటాన్ని మేం ఆస్వాదిస్తాం’ అని అతడు పేర్కొన్నాడు. కాగా రెండోసారి కఠిన నిబంధనలు పాటించేందుకు టీమ్‌ఇండియా ఇష్టపడటం లేదు. దాంతో సడలింపులు ఇవ్వాలని బీసీసీఐ.. క్రికెట్‌ ఆస్ట్రేలియాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి
రెండో రోజు మెరిసిన భారత్‌
జడ్డూ రనౌట్‌కు ఫిదా.. ఫిదా

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని