GT vs CSK: గుజరాత్‌పై చెన్నై విక్టరీ.. స్పెషల్‌ మూమెంట్స్‌.. ఫన్నీ మీమ్స్‌

ఐపీఎల్ చరిత్రలో పదోసారి ఫైనల్స్‌కు వెళ్లిన జట్టుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) రికార్డు సృష్టించింది. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ను చిత్తు చేసింది.

Updated : 24 May 2023 12:23 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌ (GT vs CSK) అద్భుత విజయం సాధించింది. మ్యాచ్‌లో ధోనీ ఉంటే ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు తమ పనేదో చేసుకునిపోతుంటారు. మైదానంలో, వెలుపలా వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇరు జట్ల ప్లేయర్లూ బంతితో, బ్యాట్‌తో పోటీపడతారు తప్ప... నోటికి పని చెప్పే అవసరం పెద్దగా రాదు. అభిమానులు ధోనీ నామజపం చేస్తారు. ఈ క్రమంలో  మ్యాచ్‌ సందర్భంగా చోటు చేసుకున్న స్పెషల్‌ మూమెంట్స్‌.. సోషల్‌ మీడియాలో వచ్చిన ఫన్నీ మీమ్స్‌పై ఓ లుక్కేద్దాం..

మ్యాచ్‌ సందర్భంగా..

  • దీపక్ చాహర్ సరదాగా చేసిన పని.. ధోనీతో సహా అందరిలోనూ నవ్వులు పూయించింది. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న విజయ్ శంకర్‌ను రనౌట్ చేసేందుకు చాహర్ ప్రయత్నించాడు. అయితే, విజయ్‌ మాత్రం క్రీజ్‌లోనే ఉన్నాడు. దీంతో ఔట్ కోసం చాహర్‌ అప్పీలు చేయలేదు. ఆ సంఘటనను చూసిన ధోనీ చిన్నగా నవ్వుకున్నాడు.
  • గుజరాత్‌ ఇన్నింగ్స్‌లోని 16వ ఓవర్‌ సందర్భంగా ధోనీ, అంపైర్ల మధ్య స్వల్ప చర్చ జరిగింది. పతిరణను బౌలింగ్‌కు తెచ్చేందుకు ఉపక్రమిస్తుండగా.. అంపైర్లు ఆపినట్లు ఉన్నారు. కాసేపు డగౌట్‌కు వెళ్లి రావడంతో వెంటనే బౌలింగ్‌కు అవకాశం ఇవ్వలేదు. దీనిపైనే అంపైర్లతో ధోనీ చర్చించాడు. చివరికి పతిరణ బౌలింగ్‌ వేసేందుకు అవకాశం రావడంతో చెన్నై ఆటగాళ్లు, అభిమానులు ఆనందించారు.
  • డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా మారిన పతిరణ తన తొలి ఓవర్‌ రెండో బంతిని 150 కి.మీ వేగంతో విసిరాడు. లాకీ ఫెర్గూసన్ (154.1), ఉమ్రాన్‌ మాలిక్ (152.1), మార్క్‌ వుడ్ (151.2) తర్వాత ఈ మార్క్‌ను తాకిన నాలుగో బౌలర్‌గా మారాడు. ఆ బంతికి డేవిడ్ మిల్లర్‌ ఒక్క పరుగు మాత్రమే రాబట్టాడు. 
  • ధోనీ సతీమణి సాక్షి, కుమార్తె జీవా స్టేడియంలో ప్రతి క్షణం ఎంజాయ్‌ చేశారు. వికెట్ పడినప్పుడు వారు చేసిన హంగామాను చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు. 

సోషల్‌ మీడియాలో.. 

  • ప్రతి డాట్‌ బాల్‌కు 500 చెట్లను నాటేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. అందులో భాగంగా ఎవరైనా బౌలర్‌ పరుగులు ఇవ్వకుండా డాట్ బాల్‌ వేస్తే స్కోరు బోర్డుపై ఓ చెట్టును సింబల్‌గా చూపించారు. దానిపైనా ఓ మీమ్‌ పుట్టుకొచ్చింది. కేఎల్ రాహుల్‌ ఆడితే ఓ అడవినే సృష్టించవచ్చనే అర్థంలో ఓ మీమర్‌ పోస్టు పెట్టాడు.
  • విజయ్‌ శంకర్‌ను నాన్‌స్ట్రైకర్‌ రనౌట్‌ చేసేందుకు ప్రయత్నించిన దీపక్‌ చాహర్‌ను చూపించి.. ఎలా చేయాలో నేర్చుకోవాలని హర్షల్‌ పటేల్‌కు ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ చెబుతున్నట్లు ఓ మీమ్‌ రూపొందించారు. ఎందుకంటే లఖ్‌నవూతో మ్యాచ్‌లో హర్షల్‌ కీలక సమయంలో నాన్‌స్ట్రైకర్‌ను రనౌట్‌ చేయడంలో విఫలమయ్యాడు.
  • ‘‘ఇప్పుడు నాకు కొంచెం కొంచెం అర్థమవుతోంది. గతేడాది మేం ఎందుకు కప్‌ గెలిచామనేది. ఎందుకంటే గత సీజన్‌ ప్లేఆఫ్స్‌లో చెన్నై లేదు’’ అని గుజరాత్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య అనుకున్నట్లు ఓ అభిమాని మీమ్ పెట్టాడు. గత సీజన్‌లో సీఎస్‌కే లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైంది. 
  • ధోనీని జీవా ఇలా అడుగుతుంది.. ‘డాడీ ఐపీఎల్‌ అంటే ఏంటి..?’.. దానికి ధోనీ సమాధానం ఇస్తూ.. ‘‘ఇదొక టోర్నీ. సీఎస్‌కేతో ఆడేందుకు 9 జట్లు పోటీ పడతాయి’’ అని చెబుతున్నట్లు ఉన్న పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
  • ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ వేసిన తుషార్‌ దేశ్ పాండే రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ సహా 19 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో తుషార్‌తో ధోనీ ఏదో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో మీమర్స్‌ చెలరేగిపోయారు. ‘‘నువ్వు చేజేతులా ఓడించేందుకు ప్రణాళికను సిద్ధం చేశావా?’’ అని ధోనీ అన్నట్లుగా ఫన్నీ మీమ్‌ను వదిలారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని