Virat Kohli: బుమ్రా విషయంలో కోహ్లీ అప్పటికప్పుడు నిర్ణయం

టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా ఎంత కీలక ఆటగాడో అందరికీ తెలిసిందే. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన అతడు అనతికాలం...

Published : 04 Feb 2022 09:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా ఎంత కీలక ఆటగాడో అందరికీ తెలిసిందే. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన అతడు అనతికాలంలోనే ఫార్మాట్లకతీతంగా మేటి బౌలర్‌గా ఎదిగాడు. అయితే, అతడి టెస్టు అరంగేట్రం అనూహ్యంగా జరిగిందని భారత మాజీ బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ గుర్తుచేసుకున్నారు. తాజాగా ఆయన ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడుతూ బుమ్రా టెస్టుల్లోకి ఎలా వచ్చాడో వివరించాడు. నాటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అప్పటికప్పుడు ఎంపిక చేశాడని పేర్కొన్నాడు.

‘2018 దక్షిణాఫ్రికా పర్యటనకు మేం 10-12 రోజుల ముందు నుంచే ప్రాక్టీస్‌ చేశాము. ఆ సమయంలో నెట్స్‌లో బుమ్రా సాధన చూసి కోహ్లీ అమితంగా ఆశ్చర్యపోయాడు. అక్కడున్న బౌలర్ల అందరిలో అతడే అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడని చెప్పాడు. దీంతో వెంటనే బుమ్రాను తొలి టెస్టులో ఆడించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి అతడి కెరీర్‌ మారిపోయింది. అయితే, అంతకుముందు బుమ్రా వన్డేల్లో ఆడేటప్పుడే టెస్టు క్రికెట్‌లో రాణించాలని ఉందని నాతో చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో మేటి బౌలర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉందన్నాడు. నేను అదే విషయాన్ని కోచ్‌ రవిభాయ్‌తో చెప్పడంతో.. అప్పుడతను బుమ్రాను టెస్టుల్లో ఆడిస్తే జట్టుకు ప్రయోజనకరమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా పర్యటనలో బుమ్రాకు టెస్టుల్లో అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. వెంటనే కోహ్లీ కూడా సెలెక్టర్లతో మాట్లాడి అతడిని తొలి టెస్టులో ఆడించాడు’ అని భరత్‌ అరుణ్‌ వివరించాడు. 

కాగా, అనుకున్నట్లే ఆ సిరీస్‌లో బుమ్రాకు అవకాశం దక్కడంతో కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ సిరీస్‌లో ఆడిన మూడు టెస్టుల్లో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. మూడో టెస్టులో ఏకంగా ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఆపై విదేశాల్లో టీమ్‌ఇండియా నంబర్‌ వన్‌ పేసర్‌గా ఎదిగాడు. ప్రతి పర్యటనలోనూ అత్యుత్తమంగా రాణించాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 27 టెస్టులు ఆడి 113 వికెట్లను పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని