జాగ్రత్త మరి: బుమ్రాలాగే భువీ కీలకం

టీ20 ప్రపంచకప్‌లో సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కీలకమవుతాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. అతడి పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో రోహిత్‌శర్మకు ఓపెనింగ్‌ భాగస్వామిగా కేఎల్‌ రాహుల్‌ను ఎంచుకుంటానని...

Updated : 27 Feb 2024 19:07 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కీలకమవుతాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. అతడి పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో రోహిత్‌శర్మకు ఓపెనింగ్‌ భాగస్వామిగా కేఎల్‌ రాహుల్‌ను ఎంచుకుంటానని పేర్కొన్నాడు.

గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్‌ కుమార్‌ తిరిగి టీమ్‌ఇండియాలో చేరాడు. గతేడాది ఐపీఎల్‌ సమయంలో అతడి తొడ కండరాల్లో చీలిక ఏర్పడింది. దాంతో లీగ్‌కు, ఆస్ట్రేలియా పర్యటనకు అతడు దూరమయ్యాడు.

‘భువనేశ్వర్‌ కుమార్‌ ఫిట్‌నెస్‌ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అతడు కీలకమైన బౌలర్‌. ప్రత్యేకించి తెలుపు బంతి క్రికెట్లో అతడి అవసరం ఎంతో ఉంది. జస్ప్రీత్‌ బుమ్రాను పక్కన పెడితే ఆరంభ, ఆఖరి ఓవర్లు వేసిన అనుభవం కేవలం భువీకి మాత్రమే ఉంది. అతడో కీలక సభ్యుడు. నవంబర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అతడు కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అందుకే అతడి పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించాలి. అతడు వందశాతం ఫిట్‌నెస్‌తో ఉండటం అవసరం. ఇంగ్లాండ్‌ సిరీసులోనూ అతడు రెండు మ్యాచులే ఆడొచ్చు. మ్యాచుల మధ్య అతడికి విరామం ఇవ్వాలి’ అని లక్ష్మణ్‌ తెలిపాడు.

ఇంగ్లాండ్‌ సిరీసులో రోహిత్‌శర్మకు ఓపెనింగ్‌ జోడీగా కేఎల్‌ రాహుల్‌ను తీసుకోవాలని వీవీఎస్‌ సూచించాడు. ‘రెండో ఓపెనర్‌ విషయానికి వస్తే ఇది చాలా కఠినమైన ప్రశ్న. రోహిత్‌శర్మ ఎలాగూ ఓపెనింగ్ చేస్తాడు. నేనైతే కేఎల్‌ రాహుల్‌ వైపు ఉంటాను. ఆ స్థానంలో కొన్నేళ్లుగా అతడు రాణిస్తుండటంతో టీమ్‌ఇండియా యాజమాన్యం అతడివైపే మొగ్గు చూపుతుందని నా అంచనా. అనుభవశాలి శిఖర్‌ ధావన్‌ సైతం ఉన్నాడు. రోహిత్‌, రాహుల్‌లో ఎవరు గాయపడ్డా, ఫామ్‌ కోల్పోయినా గబ్బర్‌ బ్యాకప్‌గా ఉంటాడు’ అని ఆయన పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని