Delhi: ఓపెనర్‌ పృథ్వీషాకు అనారోగ్యం‌.. మిగతా మ్యాచ్‌లకు దూరం

భారత టీ20 లీగ్‌ కీలక దశకు చేరుకునే సరికి దిల్లీ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ పృథ్వీ షా అనారోగ్యం బారినపడ్డాడు. దీంతో లీగ్‌ స్టేజ్‌లో ఆ జట్టు ఆడాల్సిన మిగతా...

Published : 13 May 2022 12:46 IST

(Photo: Prithvi Shaw Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ కీలక దశకు చేరుకున్న సమయంలో.. దిల్లీ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ పృథ్వీ షా అనారోగ్యం బారినపడ్డాడు. దీంతో లీగ్‌ స్టేజ్‌లో ఆ జట్టు ఆడాల్సిన మిగతా రెండు ముఖ్యమైన మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. షా కొద్ది రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆ జట్టు సహాయక కోచ్‌ షేన్‌ వాట్సన్‌ తాజాగా మీడియాకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే అతడు మిగిలిన మ్యాచ్‌లకు ఆడలేడని చెప్పాడు.

‘షాకు ఏం జరిగిందో నాకు స్పష్టమైన సమాచారం లేదు. అయితే, కొద్ది రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్నాడు. అతడెంతో నాణ్యమైన ఆటగాడు‌. ప్రపంచ శ్రేణి బౌలర్లపై ఆధిపత్యం చలాయించగల బ్యాట్స్‌మన్‌. అలాంటి ఆటగాడు లేకపోవడం మా జట్టుకు తీరని నష్టం. అతడు త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నా. అయితే, లీగ్‌ స్టేజ్‌లో మాకు మిగిలిన రెండు మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులో ఉండడు’ అని వాట్సన్‌ పేర్కొన్నాడు. అయితే, అతడు టైఫాయిడ్‌ బారిన పడ్డాడని కెప్టెన్‌ రిషభ్ పంత్‌ పేర్కొన్నాడు. 

కాగా, షా ఈ సీజన్‌లో చివరిసారి మే 1న లఖ్‌నవూతో దిల్లీ తలపడిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత జ్వరం బారిన పడటంతో.. హైదరాబాద్‌, చెన్నై, రాజస్థాన్‌ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో పాల్గొనలేదు. ఈ క్రమంలోనే దిల్లీ ప్రస్తుతం 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలుపొంది ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తోంది. అయితే, ఇతర జట్లు కూడా పోటీలో ఉండటంతో దిల్లీ మెరుగైన రన్‌రేట్‌ సాధిస్తేనే ప్లేఆఫ్స్‌ చేరుకునే వీలుంది. ఈ నేపథ్యంలో పృథ్వీ లాంటి డాషింగ్‌ ఓపెనర్‌ మిగతా రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు ఇబ్బందికరమే. ఇక పృథ్వీ ఈ సీజన్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 28.78 సగటుతో 259 పరుగులు చేశాడు. అందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని