‘జాంబీ’ల్లా మారిన టీమ్‌ఇండియా క్రికెటర్లు!

ఇంగ్లాండ్‌పై 3-1తో సిరీస్‌ దక్కించుకోవడం ఆనందంగా ఉందని టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నారు. కఠిన పరిస్థితుల్లో యువకులు రాణించడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఒత్తిడి చిత్తు చేస్తున్నా పంత్‌, సుందర్‌ ఆడిన విధానం, జట్టు స్కోరును 360కి చేర్చడం అద్భుతమని ప్రశంసించారు...

Updated : 07 Mar 2021 04:16 IST

పంత్‌పై కఠినంగా ఉండటంతోనే ఈ ఫలితం

బుడగ బద్దలవ్వాల్సిందే అంటున్న రవిశాస్త్రి

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌పై 3-1తో సిరీస్‌ దక్కించుకోవడం ఆనందంగా ఉందని టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నారు. కఠిన పరిస్థితుల్లో యువకులు రాణించడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఒత్తిడి చిత్తు చేస్తున్నా పంత్‌, సుందర్‌ ఆడిన విధానం, జట్టు స్కోరును 360కి చేర్చడం అద్భుతమని ప్రశంసించారు. బయో బుడగల్లో ఉండటం, అభిమానులు లేకపోవడంతో కుర్రాళ్లు ‘జాంబీ’ల్లా మారారని నవ్వుతూ చెప్పారు. ఆఖరి టెస్టులో విజయం తర్వాత శాస్త్రి మీడియాతో మాట్లాడారు.

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ ఐదు వికెట్ల ఘనత సాధించారు. ఇంగ్లాండ్‌ను 135 పరుగులకు కుప్పకూల్చారు. జట్టుకు భారీ విజయం అందించారు. అంతకు ముందు పంత్‌ సెంచరీ చేయగా సుందర్‌ శతకానికి చేరువకావడం గమనార్హం.

‘కుర్రాళ్లు సిరీసుపై మాత్రమే శ్రద్ధ పెట్టారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ గురించి ఆలోచించలేదు. మేం అగ్రస్థానంలో ఉన్నప్పుడు, క్రికెట్‌ ఆడినప్పుడు ఛాంపియన్‌షిప్‌ విధానం మార్చారు. మరికాస్త విశ్రాంతి దొరికి ఉంటే చెన్నైలో తొలిటెస్టు ఫలితం మరోలా ఉండేది. కుర్రాళ్లు జాంబీల్లా మారారు. గెలిచేందుకు ఎంతో ప్రయత్నించారు. నిజానికి వారిని ఉత్సాహపరిచేందుకు ప్రేక్షకులు సైతం లేరు. ఇలాంటి పిచ్‌లపై ఎవరు ఫిర్యాదు చేస్తారు. మైదానం సిబ్బంది అద్భుతంగా పనిచేశారు’ అని శాస్త్రి అన్నారు.

సిరీస్‌ ఎంత హోరాహోరీగా సాగిందో 3-1 స్కోర్‌లైన్‌ ప్రతిబింబించడం లేదని శాస్త్రి తెలిపారు. ఇంగ్లాండ్‌లో తాము 1-4తో ఓడినప్పటిలాగే అనిపించిందన్నారు. ‘ఇంగ్లాండ్‌కు అవకాశాలు వచ్చాయి. వాటిని అందిపుచ్చుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది’ అని ఆయన అన్నారు. ఆరు నెలలుగా బయోబుడగల్లో ఉన్నామని ఒకరి ముఖాలు మరొకరం చూసుకుంటూ విసిగిపోయామని శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. బుడగలు బద్దలవ్వాల్సిందే అంటూ ఛలోక్తి విసిరారు. జట్టు బృంద స్ఫూర్తితో ఆడిందని, యువకులకు అవకాశాలు ఇచ్చామని ఆయన తెలిపారు. వాటిని కుర్రాళ్లు అందిపుచ్చుకున్నారని ప్రశంసించారు. ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ పోరాడారని వివరించాడు. టీమ్‌ఇండియా ఓడిపోవడానికి ఇష్టపడటం లేదని ఆస్ట్రేలియా సిరీసే ఇందుకు ఉదాహరణ అని స్పష్టం చేశారు.

శతకంతో ఆటను మలుపుతిప్పిన రిషభ్‌పంత్‌ను శాస్త్రి ప్రత్యేకంగా అభినందించారు. సొంతగడ్డపై బంతి తిరుగుతున్నప్పుడు ఆరో స్థానంలో వచ్చి బ్యాటింగ్‌ చేయడం సులువు కాదని పేర్కొన్నారు. ‘గత నాలుగు నెలలుగా అతడు విపరీతంగా శ్రమించాడు. ఇప్పుడు దానికి ఫలితం కనిపిస్తోంది. నిన్న ఆడిన ఇన్నింగ్స్‌ అత్యుత్తమ ప్రతిదాడిగా చెప్పొచ్చు. భారత్‌లో ఆరో స్థానంలో వచ్చి అలా ఆడటం తేలిక కాదు. మేం అతడిపై జాలి చూపించలేదు. ఏదైనా సరే సులువుగా లభించదు. ఆటను గౌరవించాలని మేం అతడికి చెప్పాం. బరువు తగ్గి కీపింగ్‌ మెరుగుపర్చుకోవాలని సూచించాం. అతడి ప్రతిభ మాకు తెలుసు. అతడు నిజమైన మ్యాచ్‌ విజేత. సరైన రీతిలోనే స్పందించాడు’ అని శాస్త్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు