
రాహుల్, వరుణ్కు అంకితభావం లేదు: బ్రాడ్
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్తో పొట్టి సిరీస్కు ఎంపికై.. ఆపై ఫిట్నెస్ పరీక్షల్లో నెగ్గలేకపోయిన యువ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాతియాలకు అంకితభావం లేదని ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ విమర్శలు చేశాడు. ఇంగ్లిష్ జట్టుతో ఐదు టీ20ల సిరీస్ కోసం బీసీసీఐ కొద్దిరోజుల క్రితం ఈ ఐపీఎల్ ఆటగాళ్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, బెంగళూరులో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో వీరిద్దరూ విఫలమయ్యారు. దాంతో వచ్చిన అవకాశం చేజారిపోయింది. ఈ నేపథ్యంలోనే తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ బ్రాడ్ ఇలా చెప్పుకొచ్చాడు.
‘అంతర్జాతీయ క్రికెట్లో ఆడడానికి కావాల్సిన శక్తిసామర్థ్యాలు సాధించడంలో రాహుల్ తెవాతియా, వరుణ్ చక్రవర్తికి అంకితభావం లేదు. ఎందుకంటే టీమ్ఇండియా నిర్దేశించిన ఫిట్నెస్ పరీక్షల్లో వాళ్లు నెగ్గలేకపోయారు. ఇదే వారికి చివరి అవకాశం కావొచ్చు. దీంతో అక్కడున్న యువత.. మీకేం కావాలనే విషయంపై స్పష్టంగా ఉండాలి. మీరు ఎంచుకున్న రంగంలో రాణించడానికి అక్కడికి చేరుకోడానికి తొలి అవకాశాన్నే సద్వినియోగం చేసుకోవాలి. అందుకు కావలసిన, నిర్దేశితమైన నైపుణ్యాలు సంపాదించుకోవాలి’ అని బ్రాడ్ పేర్కొన్నాడు.
ఈ యువ క్రికెటర్లకు వచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని, దాంతో ఇదే వారికి చివరి అవకాశం అవుతుందని ఆసీస్ మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. కాగా, కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇప్పుడు రెండోసారి టీమ్ఇండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్కు ఎంపికైనా గాయం కారణంగా అతడు వెళ్లలేకపోయాడు. ఇప్పుడు రెండోసారి దక్కిన అవకాశాన్ని కూడా వరుణ్ కోల్పోవడం గమనార్హం.