IND vs SA: వాళ్లిద్దరినీ కాదని.. బుమ్రాకే ఎందుకు బాధ్యతలు అప్పగించారంటే..?

భారత క్రికెట్లో బౌలర్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం చాలా అరుదు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌ కోసం సీనియర్‌ బౌలర్ బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసి బీసీసీఐ..

Published : 02 Jan 2022 01:21 IST

ఇంటర్నెట్ టెస్క్‌: భారత క్రికెట్లో బౌలర్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం చాలా అరుదు. కానీ, త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌ కోసం సీనియర్‌ బౌలర్ బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసి బీసీసీఐ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే, ఇప్పటికే ఐపీఎల్‌లో కెప్టెన్లుగా నిరూపించుకున్న శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండగా.. బుమ్రాకే ఎందుకు ఆ బాధ్యతలు అప్పగించారనే విషయంపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది.

‘ఇటీవల ఆసీస్‌ సీనియర్‌ బౌలర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అలాగే, మేం బుమ్రాకు బాధ్యతలు అప్పగించాం. అతడు 2016 నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎలివేట్‌ చేస్తే.. శ్రేయస్ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ లాంటి యువ ఆటగాళ్లు నిలకడగా రాణించేందుకు ప్రయత్నిస్తారని సెలెక్టర్లు భావించి ఉండొచ్చు. ఎలాగూ వెస్టిండీస్, శ్రీలంక జట్లతో స్వదేశంలో జరుగనున్న సిరీసులకు వన్డే కెప్టెన్ రోహిత్‌ శర్మ అందుబాటులోకి వస్తాడు. కాబట్టి ఈ ఒక్క సిరీస్‌కే బుమ్రా వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతాడు’ బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

‘ఒక ఫాస్ట్ బౌలర్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించడం చాలా మంచి నిర్ణయం. బుమ్రా నిలకడగా రాణిస్తూ అన్ని ఫార్మాట్లలో ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. అయితే, ఒక్క సిరీస్‌లో బాధ్యతలు అప్పగించి.. అతడి నాయకత్వ పటిమపై ఓ నిర్ణయానికి రాలేం. ఒక వేళ రోహిత్, కేఎల్‌ రాహుల్ ఇద్దరూ అందుబాటులో లేకపోతే.. పరిస్థితి మరోలా ఉండేది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్.. మరింత కాలం స్థిరంగా రాణించాల్సిన అవసరం ఉంది’ అని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు. ఐపీఎల్-2020 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించి ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత 2021 సీజన్‌లో దిల్లీ పగ్గాలు చేపట్టిన రిషభ్‌ పంత్‌ కూడా మెరుగ్గానే రాణించాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని