
Ashwin: అశ్విన్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే.. కుంబ్లే రికార్డు బద్దలవుతుంది : జహీర్ ఖాన్
ఇంటర్నెట్ డెస్క్: రవిచంద్రన్ అశ్విన్ ఇదే ఫామ్ను మరి కొన్నేళ్ల పాటు కొనసాగిస్తే.. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డు బద్దలవుతుందని టీమ్ఇండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అశ్విన్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లోనే మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (417 వికెట్లు) రికార్డును అధిగమించాడు. దీంతో టీమ్ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా అశ్విన్ (427 వికెట్లు) నిలిచాడు. ఇతని కంటే ముందు అనిల్ కుంబ్లే (619 వికెట్లు), కపిల్ దేవ్ (434 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
‘టెస్టు క్రికెట్లో అశ్విన్ తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నాడు. బౌలింగ్లో ఎప్పటికప్పుడూ వైవిధ్యం చూపుతున్నాడు. కచ్చితత్వంతో బంతులేస్తున్నాడు. అందుకే, జట్టులోకి ఎంతో మంది యువ ఆటగాళ్లు వస్తున్నా.. అతడు చాలా ఏళ్లుగా టెస్టు క్రికెట్లో కొనసాగగలుగుతున్నాడు. ఇదే ఫామ్ను మరి కొన్నేళ్ల పాటు కొనసాగిస్తే.. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డు బద్దలవుతుంది’ అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అశ్విన్ 14 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 6 వికెట్లు తీయగా.. ముంబయిలో జరిగిన రెండో టెస్టులో 8 వికెట్లు పడగొట్టాడు.
► Read latest Sports News and Telugu News