olympics: అథ్లెట్ల కోసం అట్టపెట్టెల మంచాలు

జపాన్‌లోని టోక్యో వేదికగా ఒలింపిక్స్‌ క్రీడలు జులై 23 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. క్రీడల నిర్వహణ కోసం జపాన్‌ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో క్రీడాగ్రామంలో అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన మంచాలు ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఎందుకంటే ఒలింపిక్స్‌ నిర్వాహకులు

Updated : 19 Jul 2021 16:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌లోని టోక్యో వేదికగా ఒలింపిక్స్‌ క్రీడలు జులై 23 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. క్రీడల నిర్వహణ కోసం జపాన్‌ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో క్రీడాగ్రామంలో అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన మంచాలు ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఎందుకంటే ఒలింపిక్స్‌ నిర్వాహకులు మంచాలను కలపతో కాకుండా అట్టపెట్టెలతో తయారు చేయించారు. ఈ మంచంపై కేవలం ఒకరు మాత్రమే పడుకునే వీలు ఉంటుంది. ఇవి 200 కిలోల బరువు వరకు తట్టుకుంటాయని అథ్లెట్ల గ్రామ మేనేజర్‌ టకాషీ కిటజిమా తెలిపారు. భూ పర్యావరణాన్ని కాపాడేందుకే ఇలా అట్టెపెట్టెలతో మంచాలు ఏర్పాటు చేయించారట. మంచాలు, పరుపులను కొనుగోలు చేస్తే వాటిలో ఉపయోగించే వస్తువులు, ప్యాకింగ్‌కు ఉపయోగించే కవర్లు రిసైకిల్‌ చేస్తే తిరిగి ప్లాస్టిక్‌ వస్తువులే తయారు అవుతాయి. ఈ అట్టపెట్టెలయితే పర్యావరణహితంగా ఉంటాయని అంటున్నారు. ఒలింపిక్స్‌ క్రీడలు పూర్తయ్యాక వీటిని రిసైకిల్‌ చేసి కాగితాలుగా మార్చుతారట. గతేడాదే ఈ మంచాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. కానీ, కరోనా కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్స్‌ వాయిదా పడింది.

కేవలం మంచాలే కాదు.. క్రీడల్లో గెలుపొందిన అథ్లెట్లకు బహుకరించే పతకాలు సైతం రిసైకిల్‌ ద్వారా చేసినవే. 6.2 మిలియన్‌ పాత మొబైల్స్‌తోపాటు టన్నుల కొద్ది ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నుంచి పతకాలను రూపొందించారు. ఒలింపిక్స్‌ టార్చ్‌లైట్‌ కూడా వ్యర్థాల నుంచి సేకరించిన అల్యూమినియమ్‌తో తయారు చేశారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌ కోసం భారత్‌ నుంచి తొలి బృందం శనివారం బయల్దేరి వెళ్లింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ బృందానికి క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఐఓఏ అధ్యక్షుడు నరిందర్‌ బత్రా తదితరులు వీడ్కోలు పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని