IPL 2022: ఎక్కడికెళ్లినా ధోనీ అభిమానులే.. సూరత్‌లోనూ తగ్గని క్రేజ్

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అతనెక్కడికి వెళ్లినా అభిమానులు ఫాలో అవుతూనే ఉంటారు...

Published : 11 Mar 2022 09:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అతనెక్కడికి వెళ్లినా అభిమానులు ఫాలో అవుతూనే ఉంటారు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీని కేవలం ముంబయి, పుణె నగరాలకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని ఫ్రాంఛైజీలు అక్కడికి సమీపంలోనే ప్రాక్టీస్‌ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే చెన్నై టీమ్‌ సైతం ఇప్పుడు సూరత్‌లో ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కెప్టెన్‌ ధోనీతో పాటు పలువురు ఆటగాళ్లు అక్కడే సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఆ జట్టు ఆటగాళ్లు రోజూ హోటల్‌ నుంచి మైదానానికి.. అక్కడి నుంచి తిరిగి హోటల్‌కు వెళ్లే దారిలో అభిమానులు పెద్ద ఎత్తున పడిగాపులు కాస్తున్నారు. రోడ్డుకిరువైపులా నిల్చొని ధోనీసేనకు చేతులు ఊపుతూ సంబరపడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులు అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీంతో ధోనీ ఎక్కడికెళ్లినా ఆ జట్టుకు ఉండే క్రేజ్‌ ఏంటో అర్థమవుతుంది.

మరోవైపు ఇటీవలే ఆ జట్టు నెట్‌బౌలర్‌ రాకీ వార్న్‌ పుట్టిన రోజు జరిగింది. మార్చి 7న కెప్టెన్‌ ధోనీనే దగ్గరుండి మరీ అతడి జన్మదిన వేడుకలు నిర్వహించాడు. రాకీతో కేక్‌ కోయించి సంబరాలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను కూడా చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులు అదే ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో చెన్నై టీమ్‌లో చిన్నా.. పెద్దా ఆటగాళ్లనే భేదం లేకుండా అందర్నీ ఒకేలా చూస్తారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన పుట్టిన రోజును మరిచిపోలేని విధంగా జరిపినందుకు రాకీవార్న్‌ సైతం ధోనీతో పాటు జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. తన పుట్టిన రోజును ఇలా సెలబ్రేట్‌ చేయడం అద్భుతంగా ఉందని, ఇది తనకు నమ్మశక్యంగా లేదని పోస్టు చేశాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని