Asia Cup 2023: ఆసియా కప్‌ టోర్నీకి కొవిడ్ ముప్పు ఉందా..?

మరో నాలుగు రోజుల్లో ఆసియా కప్‌ (Asia Cup 2023) ప్రారంభం కానుంది. అయితే, శ్రీలంక ఆటగాళ్లకు కరోనా సోకడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మినీ టోర్నీకి ఆటంకాలు ఎదురవుతాయా..? అనే సందేహాలు మొదలయ్యాయి.

Published : 26 Aug 2023 14:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మూడేళ్ల కిందట ప్రపంచాన్ని హడలెత్తించిన కరోనా వైరస్‌ (Covid 19) ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపించడం లేదు. కానీ ఆసియా కప్ వంటి మినీ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి కొవిడ్ కేసులు నమోదు కావడం.. అదీనూ శ్రీలంక క్రికెటర్లకు సోకడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆగస్ట్ 30 నుంచి ఆసియా కప్ (Asia Cup 2023) మొదలుకానుంది. పాక్‌లో నాలుగు, శ్రీలంక వేదికగా 9 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆగస్ట్ 31న పల్లెకెలె వేదికగా శ్రీలంక - బంగ్లాదేశ్‌ (SL vs BAN) మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే, కరోనా పాజిటివ్‌గా తేలిన శ్రీలంక ఆటగాళ్లు కుశాల్‌, ఆవిష్కలను ఐసోలేషన్‌లో ఉంచారు. అప్పటిలోగా కోలుకుని నెగెటివ్‌ నిర్థారణ అయితేనే బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. టోర్నీ ప్రారంభమైన తర్వాత ఇతర ఆటగాళ్లకు సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆసియా కప్‌లోని భారత్‌ మ్యాచులన్నీ శ్రీలంక వేదికగానే జరగనున్నాయి. మినీ టోర్నీ ముగిశాక ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌ జరగనున్న సంగతి తెలిసిందే.

అప్పుడన్నీ బయో బబుల్‌లోనే.. 

కొవిడ్‌ వచ్చిన తొలినాళ్లలో అంతర్జాతీయంగా క్రికెట్ మ్యాచ్‌లను రద్దు చేయడం జరిగింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లతోపాటు ద్వైపాక్షిక సిరీస్‌లనూ ప్రేక్షకులు లేకుండానే నిర్వహించిన పరిస్థితిని చూశాం. బయో బబుల్‌ను సృష్టించి మరీ క్రికెటర్లను ప్రత్యేకంగా ఉంచిన సందర్భాలూ ఉన్నాయి. ప్రతి ఆటగాడికి కరోనా పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌ వచ్చిన వారినే మ్యాచ్‌లు ఆడించారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కొందరు కరోనాబారిన పడ్డారు. అయితే, వారూ త్వరగానే కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐపీఎల్ 2020, 2021 సీజన్లు ఇలానే నిర్వహించారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేనప్పటికీ.. శ్రీలంకలో ఆటగాళ్లకు మళ్లీ కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని జాగ్రత్తలు అవసరం.. 

ప్రస్తుతం కొవిడ్‌ ప్రమాద తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. పాజిటివ్‌గా నిర్థారణ అయితే ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి. బయో బబుల్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేనప్పటికీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకితే కీలక మ్యాచ్‌లకు ఆటగాళ్లు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇటీవలే ముగిసిన లంక ప్రీమియర్‌ లీగ్‌లోనే కొవిడ్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. మైదానాల్లో, డగౌట్లలో పక్కాగా శానిటైజేషన్‌ చేయాల్సిన అవసరం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని