T20 World Cup: ఒకవేళ రూట్‌ ఇండియన్‌ అయితే... టీ20 కెప్టెన్‌ అయ్యేవాడు: చోప్రా

టీ20 ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్‌ ఎంపిక చేసిన తీరును చూసి టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ నేర్చుకోవాలని...

Published : 07 Nov 2021 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్‌ ఎంపిక చేసిన తీరును చూసి టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ నేర్చుకోవాలని మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా సూచించాడు. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్‌ తన టీమ్‌ను ఎంచుకుందని.. అయితే భారత్‌ మాత్రం ఉపఖండ సంస్కృతి ‘వ్యక్తిగత’ ప్రాధమ్యాలను అనుసరించి సెలక్షన్‌ చేసినట్లు పేర్కొన్నాడు. ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో కీలక ఆటగాళ్లు జొఫ్రా ఆర్చర్, బెన్‌ స్టోక్స్‌ లేకుండానే ఇంగ్లాండ్‌ వరుస విజయాలతో ఎలా దూసుకెళ్తోంది? అన్న దానికి స్పందిస్తూ.. ‘‘ఇంగ్లాండ్‌ ఓ ఫిలాసఫీతో ముందుకెళ్తుంది. తమ ప్రాధాన్యత ఏంటో వారికి స్పష్టంగా తెలుసు. ఆటగాళ్లందరూ లక్ష్యం (ఒకే దిశ) వైపు వెళ్తున్నారు. దేశవాళీలో రాణించిన ఆల్‌రౌండర్లను ఎంపిక చేసుకున్నారు. పొట్టి ఫార్మాట్‌ కోసం నాట్‌వెస్ట్‌ బ్లాస్ట్‌ టీ20, ది హండ్రెడ్‌ టోర్నీల నుంచి జట్టును మేనేజ్‌మెంట్ ఎంచుకుంది. ఇదే వారి విజయాలకు కారణం కావచ్చు’’ అని వివరించాడు. 

టీమ్‌ఇండియా సెలక్షన్‌ ప్రక్రియను కూడా ఆకాశ్‌ చోప్రా తప్పుబట్టాడు. ఒకవేళ జోయ్‌ రూట్‌ (ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్‌) భారతీయుడు అయి ఉంటే.. పొట్టిఫార్మాట్‌లో స్ట్రైక్‌రేట్‌ను పరిగణించకుండా రూట్‌ను కూడా టీ20 జట్టు సారథిగా టీమ్‌ఇండియా సెలక్షన్ కమిటీ నియమించేదని చోప్రా వ్యాఖ్యానించాడు. అయితే ఇంగ్లాండ్‌ మాత్రం చేయలేదన్నాడు. ‘‘టెస్టు ప్రదర్శనను ఇంగ్లాండ్ పరిగణనలోకి తీసుకోలేదు. వారు ఎంత మంచి ఆటగాళ్లైనా సరే పక్కన పెట్టేశారు. జోయ్‌ రూట్‌నే తీసుకుంటే టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు. అలాంటి రూట్‌కు జట్టులో చోటు కల్పించలేదు. అదే ఇండియాలో అయితే స్ట్రైక్‌ రేట్‌తో పని లేకుండానే టీ20 టీమ్‌కు కెప్టెన్‌ని చేసేవారని నేను రాసిస్తా.. అయితే ఇంగ్లాండ్‌ మాత్రం ఆ విధంగా చేయలేదు. ఫార్మాట్‌ను బట్టి ఆటగాళ్లను ఎంపిక చేసింది. డేవిడ్‌ మలన్‌ ఎక్కువగా టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. అయితే టీ20 స్పెషలిస్ట్‌. అలానే మొయిన్‌ అలీ, అదిల్ రషీద్‌ నుంచి ఏం ఆశిస్తున్నారో మేనేజ్‌మెంట్‌ తెలిపింది.  వాళ్ల ప్రాధాన్యత ఏంటో వారికి స్పష్టంగా తెలుసు. దాని కోసం కొంతమందిని పక్కన పెట్టి మరీ జట్టును ఎంపిక చేసుకుంది. ఇలాంటి పరిస్థితి టీమ్‌ఇండియా స్క్వాడ్ ఎంపికలో లేదు’’అని చోప్రా పేర్కొన్నాడు.

గ్రూప్‌ స్టేజ్‌లో వరుసగా నాలుగు విజయాలతో ఇప్పటికే ఇంగ్లాండ్‌ (8) సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఇవాళ సాయంత్రం దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్‌ను ఆడనుంది. టీమ్‌ఇండియా (4) మాత్రం రెండు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా.. కివీస్‌, అఫ్గాన్‌ మ్యాచ్‌ ఫలితంపైనే సెమీస్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ కివీస్‌ గెలిస్తే మాత్రం.. ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించినా ప్రయోజనం ఉండదు. కివీస్‌పై అఫ్గాన్‌ స్వల్ప తేడాతో గెలిచి.. నమీబియాపై టీమ్‌ఇండియా విజయం సాధిస్తే చాలు సెమీస్‌ బెర్తు ఖాయమైపోయిద్ది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని