WTC: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌.. ఆ జట్టులో రిషభ్‌ పంత్‌కు స్థానం!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ బుధవారం (జూన్ 7) నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో గత రెండేళ్లలో (డబ్ల్యూటీసీ 2021-2023) బాగా రాణించిన వివిధ దేశాల ఆటగాళ్లతో తమ బెస్ట్ ఎలెవన్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా రూపొందించింది.  

Published : 05 Jun 2023 14:50 IST

ఇంటర్నెట్ డెస్క్: డబ్ల్యూటీసీ (WTC) టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత రెండేళ్లలో (డబ్ల్యూటీసీ 2021-2023) బాగా రాణించిన వివిధ  దేశాల ఆటగాళ్లతో తమ బెస్ట్ ఎలెవన్‌ను రూపొందించింది. ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే.. బ్యాటింగ్‌లో ఒక్కరికీ అవకాశం దక్కలేదు. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్ పుజారాలలో ఒక్కరు కూడా ఈ జాబితాలో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. స్పిన్‌, ఆల్‌రౌండర్ల  కోటాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు కల్పించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడటానికి ముందు టెస్టుల్లో సంచలన బ్యాటింగ్‌తో అలరించిన రిషభ్‌ పంత్‌ (Rishabh Pant)ను వికెట్ కీపర్‌గా ఎంచుకుంది. 2022 డిసెంబర్‌ చివరిలో పంత్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో తర్వాత జరిగిన పలు వన్డే, టీ20 సిరీస్‌లతోపాటు బోర్డర్‌-గావస్కర ట్రోఫీలోనూ పంత్ ఆడలేదు. ప్రస్తుతం కోలుకుంటున్న రిషభ్‌ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-16 సీజన్‌కూ దూరంగా ఉన్నాడు. 

క్రికెట్‌ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ టీమ్‌ ఆఫ్ ది టోర్నమెంట్‌కు పాట్‌ కమిన్స్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఓపెనర్లుగా ఉన్మాన్‌ ఖవాజా (ఆసీస్), డిమిత్ కరుణరత్నె (శ్రీలంక)లను తీసుకుంది. బాబర్ అజామ్ (పాకిస్థాన్‌)కు మూడో స్థానంలో, జో రూట్ (ఇంగ్లాండ్)కు నాలుగో స్థానంలో అవకాశం కల్పించింది. దూకుడైన బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్న ట్రావిస్ హెడ్‌ (ఆస్ట్రేలియా)ను ఐదో స్థానంలో తీసుకుంది. ఫాస్ట్ బౌలర్ల కోటాలో పాట్ కమిన్స్‌ (ఆసీస్), జేమ్స్‌ అండర్సన్ (ఇంగ్లాండ్), కగిసో రబాడ (సౌతాఫ్రికా)లను తీసుకుంది. ఇదిలా ఉండగా.. బుధవారం (జూన్ 7) నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final) ప్రారంభంకానుంది. లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా జరిగే ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో భారత్‌, ఆసీస్‌ తలపడనున్న విషయం తెలిసిందే. 

క్రికెట్‌ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్

ఉస్మాన్ ఖవాజా, డిమిత్ కరుణరత్నె, బాబర్ అజామ్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్‌, జేమ్స్ అండర్సన్, కగిసో రబాడ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు