CSK - MSD: వచ్చే ఏడాది ధోనీ ఆడతాడా..? లేదా..? : సీఎస్‌కే సీఈవో ఏమన్నారంటే..

కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్‌ రిటైర్‌మెంట్‌పై చర్చ కొనసాగుతూనే ఉంది. సీజన్‌ ఆరంభం నుంచే క్రికెట్ విశ్లేషకులు ఎవరికి తోచినవిధంగా వారు అంచనా వేస్తున్నారు.

Updated : 15 May 2023 14:06 IST

ఇంటర్నెట్ డెస్క్: ఎంఎస్ ధోనీ (MS Dhoni) మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs KKR) మ్యాచ్‌ జరిగింది. ఇందులో సీఎస్‌కే ఓటమిపాలైంది. కానీ, అభిమానులు మాత్రం ఎలాంటి నిరుత్సాహానికి గురికాకుండా తమ జట్టుకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో మరోసారి ధోనీ రిటైర్‌మెంట్‌పై చర్చకు తెరలేసింది. చెపాక్‌లో చెన్నైకు చివరి లీగ్‌  మ్యాచ్‌ కావడం.. చివర్లో ఆటగాళ్లంతా మైదానమంతా కలియతిరగడంతో ధోనీకిదే చివరి సీజన్‌ అని అభిమానుల్లో సందేహం తలెత్తింది. సునీల్‌ గావస్కర్ కూడా ధోనీ ఆటోగ్రాఫ్‌ను తీసుకోవడంతో ఆ వాదనకు మరింత బలం చేకూరినట్లు అయింది. 

చెపాక్‌లో రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఉన్నప్పటికీ.. లీగ్‌దశలో మాత్రం సీఎస్కేకు ఇదే చివరి మ్యాచ్‌. దీంతో ఆటగాళ్లు కూడా చెన్నై అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.  ఈ వీడియోను సీఎస్‌కే తన సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. అయితే, చివర్లో చెన్నై ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ కీలక విషయం తెలియజేశాడు. ‘‘వచ్చే సీజన్‌లోనూ ధోనీ తప్పకుండా ఆడతాడనే నమ్మకం మాకుంది. అభిమానులు ఎల్లవేళలా ఇలానే మద్దతుగా నిలవాలని కోరుతున్నా’’ అని సీఈవో వెల్లడించారు. 

ప్రస్తుతం 15 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో వారి సొంతమైదానంలో సీఎస్‌కే తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. అప్పుడు, ముంబయి, లఖ్‌నవూ, బెంగళూరుతో పోటీ పడాల్సి ఉంటుంది. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ (మే 23), ఎలిమినేటర్‌ మ్యాచ్‌ (మే 24) చెన్నైలో జరుగుతాయి. చెన్నై టాప్‌ - 2లో ఉంటే తొలి క్వాఫయిర్‌ను చెన్నైలో ఆడే అవకాశం ఉంటుంది. మూడు లేదా నాలుగో స్థానంలో ఉంటే కూడా చెన్నైలోనే ఎలిమినేటర్‌ మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. రెండో క్వాలిఫయర్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని