MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..

ఐపీఎల్‌ 2023 టైటిల్‌ విజేత(IPL 2023 Winner)గా చెన్నై సూపర్‌ కింగ్స్‌(chennai super kings) ఐదోసారి నిలిచి ముంబయి రికార్డును సమం చేసింది. అయితే.. ఈ సీజన్‌లో మ్యాచ్‌ల కంటే.. ధోనీ(MS Dhoni) గురించే ఎక్కువ చర్చ కొనసాగింది.

Updated : 31 May 2023 11:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : సాధారంగా ఒక విమానం గాల్లోకి ఎగిరినప్పుడు అది చేసే శబ్దం 100 డెసిబెల్స్‌కుపైనే ఉంటుంది. ఇక రాకెట్‌ ప్రయోగించినప్పుడు అది చేసే శబ్దం గురించి చెప్పనక్కర్లేదు. అయితే.. ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటారా..? యంత్రాలు చేసే శబ్దాలు ఇవి. కానీ.. ఓ వ్యక్తి కోసం అతడి అభిమానులు చేసే హోరు కూడా ఇదే స్థాయిలో ఉంటే.. నమ్మశక్యంగా లేదు కదా. అయితే.. ఇది నిజం. ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే ఓ ఆటగాడి గురించి అభిమానులు స్టేడియాలన్నింటినీ హోరెత్తించారు. ఆ ఆటగాడే.. చెన్నైకి అయిదోసారి టైటిల్‌నందించిన ది గ్రేట్‌ మహేంద్రసింగ్‌ ధోనీ(MS Dhoni).

ఈ ఐపీఎస్‌ సీజన్‌(IPL 2023) ఎప్పుడూ లేని విధంగా ధోనీ(MS Dhoni) నామస్మరణతో మారుమోగింది. మహీకిదే చివరి సీజన్‌ అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో.. సొంత మైదానం, బయటి మైదానం అన్న తేడాయే లేదు. ధోనీ కనిపిస్తే చాలు.. అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. ఈలలు, కేరింతలతో వారు చేసే శబ్దాలతో మైదానాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. ఇది ఎంతలా అంటే.. చాలా సార్లు ఈ శబ్దాలు 120 డెసిబెల్స్‌ స్థాయికి చేరాయి.

ధోనీ స్టేడియంలో కనిపించగానే అభిమానులు చేసే శబ్దాల స్థాయికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌ పంచుకుంది.

  • చెన్నై చెపాక్‌ స్టేడియం(Chennai Chepauk Stadium)లో గత నెల 3న జరిగిన మ్యాచ్‌లో ధోనీ టాస్‌ వేసేందుకు స్టేడియంలోకి రాగానే.. అభిమానుల కేరింతల శబ్దం 120 డెసిబెల్స్‌కు చేరింది. సాధారణంగా ఒక ఎయిర్‌క్రాఫ్‌ చేసే శబ్దం కంటే ఇది ఎక్కువేనని నిపుణులు అంటున్నారు.
  • చెన్నైలో ఏప్రిల్‌ 12 జరిగిన మ్యాచ్‌లోనూ 120 డెసిబెల్స్‌ సౌండ్‌ క్రియేట్‌ అయింది. ఆ తర్వాత ఈ స్టేడియంలో పలు సందర్భాల్లో ఇదే స్థాయికి శబ్దం చేరింది.
  • ఇతర స్టేడియాల్లో కూడా ధోనీ మోత మోగింది. ముంబయి, లఖ్‌నవూల్లో 117 డెసిబెల్స్‌, బెంగళూరు, కోల్‌కతా, దిల్లీ స్టేడియాల్లో 115 డెసిబెల్స్‌, జైపుర్‌లో 112 డెసిబెల్స్‌ నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
  • ధోనీ టాస్‌ కోసం వచ్చినప్పుడు.. అతడిని చూసి అభిమానులు చేసే శబ్దాలతో అసలు ఏమీ వినిపించడం లేదని వ్యాఖ్యాతలు అన్న సందర్భాలూ ఉన్నాయి.
  • దిల్లీతో జరిగిన ఓ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ధోనీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే కామెంటేటర్‌ డానీ మారిసన్‌కు ధోనీ అభిమానుల కేరింతల మధ్య ఇది వినిపించలేదు. చివరికీ ఏం ఎంచుకున్నారు.. అని సైగల ద్వారా ధోనీని అడిగి తెలుసుకోవాల్సి వచ్చింది.
  • ఇక చెపాక్‌ స్టేడియంలో ఓ మ్యాచ్‌ అనంతరం ధోనీ మాట్లాడేందుకు సిద్ధం కాగా.. అభిమానులు చేసే శబ్దాలతో వ్యాఖ్యాతలు ఏం అడుగుతున్నారో వినిపించలేదు. దీంతో ధోనీయే స్వయంగా అక్కడున్న స్పీకర్‌ వ్యాల్యూమ్‌ పెంచాల్సి వచ్చింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని