Delhi : ఈ సీజన్‌లోనైనా దిల్లీ ‘పంతం’ నెగ్గుతుందా?

తెలుగు పారిశ్రామిక వేత్తకు చెందిన జీఎంఆర్‌ గ్రూప్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ సొంతమైన...

Updated : 26 Mar 2022 14:01 IST

వార్నర్‌, శార్దూల్‌ కోసం భారీ మొత్తం వెచ్చించిన దిల్లీ

ఒకే ఒక్కసారి దేశవాళీ లీగ్‌ ఫైనల్‌కు చేరిన మూడు జట్లలో దిల్లీ కూడా ఉంది. అదీ మెగా టోర్నీ ప్రారంభమైన దాదాపు పుష్కరం తర్వాత కావడం విశేషం. గతేడాది యువ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ నేతృత్వంలోని ప్లేఆఫ్స్‌ వరకు వెళ్లినా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఈసారి మెగా వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకుని మరీ బరిలోకి దిగబోతోంది. మరి దిల్లీ కీలకం ఎవరు? ఓపెనింగ్, మిడిలార్డర్‌.. బౌలింగ్‌ దళం ఎలా ఉండనుంది? తదితర అంశాల్ని పరిశీలిస్తే.. 

తెలుగు పారిశ్రామికవేత్తకు చెందిన జీఎంఆర్‌ గ్రూప్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ సొంతమైన దిల్లీకి యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్ నాయకుడు. ఈ సారి మెగా వేలంలో నాణ్యమైన ఆటగాళ్ల కోసం చాలా తెలివిగా ఖర్చు పెట్టింది. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు భారీ మొత్తం వెచ్చించింది. గత రెండు సీజన్‌లు తప్పించి అంతకుముందు వరకు హైదరాబాద్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌, సారథిగా ఫ్రాంచైజీకి టైటిల్‌ను అందించిన డేవిడ్ వార్నర్‌ (రూ.6.50 కోట్లు)ను ఈసారి దిల్లీ మంచి ధరకు సొంతం చేసుకొంది. అండర్‌ -19 ప్రపంచకప్‌ టైటిల్‌ను అందించిన యువ భారత్‌ సారథి యాష్ ధుల్‌తో సహా స్పిన్నర్‌ విక్కీ ఓత్స్వాల్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసుకుంది.

బ్యాటింగ్‌లో వీరే కీలకం.. 

బ్యాటింగ్‌పరంగా దిల్లీకి పెద్దగా ఇబ్బందులేమీ లేవు. అయితే విదేశీ ఆటగాళ్ల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రిషభ్‌ పంత్, పృథ్వీ షా, డేవిడ్‌ వార్నర్‌, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్‌ ఖాన్‌, రోవ్‌మన్‌ పావెల్‌, అక్షర్‌ పటేల్, శార్దూల్ ఠాకూర్‌, టిమ్‌ సీఫెర్ట్‌, కేఎస్‌ భరత్‌ కీలక ప్లేయర్లు. గత సీజన్‌ వరకు పృథ్వీషాకు తోడుగా శిఖర్ ధావన్‌ ఓపెనింగ్‌కు దిగేవాడు. ఈసారి ప్రమాదకర బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ వచ్చేస్తాడు. వీరిద్దరూ కాసేపు నిలబడితే చాలు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఆ తర్వాత రోవ్‌మన్‌ పావెల్ వచ్చే అవకాశం ఉంది. రిషభ్‌ పంత్, సర్ఫరాజ్‌ ఖాన్‌, అశ్విన్ హెబ్బర్‌/కేఎస్‌ భరత్/సీఫెర్ట్‌, అక్షర్‌ పటేల్, శార్దూల్ ఠాకూర్‌ వరుసగా బ్యాటింగ్‌ చేయగలరు. 

బౌలింగ్ దాడి సూపర్బ్‌.. 

దిల్లీ బౌలింగ్‌ దళం మాత్రం అద్భుతం. అంతర్జాతీయంగా పేసర్లు, స్పిన్నర్లతో ఎటాకింగ్‌గా ఉంది. ఆన్రిచ్‌ నార్జ్‌, లుంగి ఎంగిడి, చేతన్‌ సకారియా, ఖలీల్‌ అహ్మద్, ముస్తాఫిజర్‌ రెహ్మాన్, అక్షర్‌ పటేల్, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మిచెల్ మార్ష్, కమ్లేష్ నాగర్‌కోటి వంటి బౌలర్లు ఉండటం దిల్లీకి సానుకూలాంశం. తుది జట్టులో మాత్రం తప్పనిసరిగా నార్జ్‌, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శార్దూల్, ముస్తాఫిజర్‌/మిచెల్‌ మార్ష్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ పరంగా రిజర్వ్ బెంచ్‌ కూడా పటిష్టంగా ఉంది.

టాప్‌ ఆల్‌రౌండర్లు దిల్లీ సొంతం

పొట్టి ఫార్మాట్‌లో కీలకమైన ఆల్‌రౌండర్లు దిల్లీ జట్టులోనూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న అక్షర్‌ పటేల్‌ను దిల్లీ రిటెయిన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే, భారీ మొత్తం (రూ.10.75 కోట్లు) వెచ్చించి మరీ కొనుగోలు చేసిన శార్దూల్‌ ఠాకూర్‌, మిచెల్‌ మార్ష్ (రూ. 6.50 కోట్లు)తో పాటు రోవ్‌మన్ పావెల్ (రూ. 2.80 కోట్లు) ఇటు బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌ చేయగల సమర్థులు. మిడిలార్డర్‌తోపాటు లోయర్‌ ఆర్డర్‌లోనూ పరుగులు సాధించగలరు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ కోచింగ్‌.. రిషభ్‌ పంత్ నాయకత్వంలో ఈసారైనా కప్ నెగ్గాలని దిల్లీ యాజమాన్యం సహా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

దిల్లీ జట్టు ఇదే:

రిషబ్‌ పంత్ (కెప్టెన్), అశ్విన్‌ హెబ్బర్, డేవిడ్ వార్నర్, మన్‌దీప్‌ సింగ్, పృథ్వీ షా, రోవ్‌మన్ పావెల్, కేఎస్ భరత్, టిమ్‌ సీఫెర్ట్, అక్షర్ పటేల్, కమ్లేష్ నాగర్‌కోటి, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్‌ దూబె, రిపల్ పటేల్, సర్ఫరాజ్‌ ఖాన్‌, విక్కీ ఓత్స్వాల్, యాష్ ధుల్, ఆన్రిచ్‌ నార్జ్, చేతన్‌ సకారియా, కుల్‌దీప్‌ యాదవ్, లుంగి ఎంగిడి, ముస్తాఫిజర్‌ రహ్మాన్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని