DDw vs UPWw: యూపీ చిత్తు.. దిల్లీ క్యాపిటల్స్‌కు వరుసగా రెండో విజయం

మహిళల ప్రీమియర్ లీగ్‌ (WPL)లో దిల్లీ క్యాపిటల్స్‌ (DCW) వరుసగా రెండో విజయం. తమ మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీని చిత్తు చేసిన క్యాపిటల్స్‌.. ఇప్పుడు యూపీ వారియర్స్‌ (UPWW)పై ఘన విజయం సాధించింది.

Updated : 07 Mar 2023 23:39 IST

ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్‌ (WPL)లో దిల్లీ క్యాపిటల్స్‌కు (DCW) వరుసగా రెండో విజయం. తమ మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీని చిత్తు చేసిన క్యాపిటల్స్‌.. ఇప్పుడు యూపీ వారియర్స్‌ (UPWW)పై ఘన విజయం సాధించింది. ముంబయిలోని డీవై పాటిల్‌ స్టేడియంలో యూపీతో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ 42 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. అనంతరం బరిలోకి దిగిన యూపీ వారియర్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 169 పరుగులే చేసింది. తాహిలా మెక్‌గ్రాత్ (90*; 50 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ ఇన్నింగ్స్‌ ఆడినా జట్టును గెలిపించలేకపోయింది. అలీసా హీలే (24), దేవికా వైద్య (23) ఫర్వాలేదనిపించారు. దీప్తి శర్మ (12), కిరణ్ నవ్‌గిరె (2), శ్వేత సెహ్రావత్‌ (1) నిరాశపరిచారు. దిల్లీ బౌలర్లలో జొనాస్సెన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మరిజేన్‌ కాప్‌, శిఖా పాండే తలో వికెట్ తీశారు. 

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీకి మంచి ఆరంభమే లభించింది. అలీసా హీలే దూకుడుగా ఆడటంతో మూడు ఓవర్లకు స్కోరు 25/0గా నమోదైంది. జోనాస్సెన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో యూపీకి గట్టి షాక్‌ తగిలింది. అలీసా.. రాధా యాదవ్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరగా, గత మ్యాచ్‌లో అర్ధ శతకం బాదిన కిరణ్‌ నవ్‌గిరె.. కాప్సీకి చిక్కింది. మారిజేన్‌ కాప్ వేసిన ఐదో ఓవర్‌లో శ్వేత కూడా పెవిలియన్‌కు చేరింది.  దీంతో దిల్లీ 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్‌, దీప్తి శర్మ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. శిఖా పాండే వేసిన 11 ఓవర్‌లో దీప్తి శర్మ ఔట్‌ కాగా.. జొనాస్సెన్‌ వేసిన 17 ఓవర్‌లో దేవికా వైద్య పెవిలియన్‌ చేరింది. ఆఖర్లో మెక్‌గ్రాత్‌ దూకుడుగా ఆడినా అప్పటికే యూపీ ఓటమి ఖరారైపోయింది.

మొదట్లో లానింగ్‌ దూకుడు.. చివర్లో జొనాస్సెన్ మెరుపులు

కెప్టెన్‌ మెగ్  లానింగ్ (70; 42 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకానికితోడు చివర్లో జెస్ జొనాస్సెన్ (42*; 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టడంతో దిల్లీ భారీ స్కోరు చేసింది. జెమీమా రోడ్రిగ్స్‌ (34*; 22 బంతుల్లో 4 ఫోర్లు), అలీస్‌ కాప్సీ (21), షెఫాలీ వర్మ (17), మరిజేన్ కాప్ (16) పరుగులు చేశారు.  దిల్లీ బౌలర్లలో  షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, మెక్‌గ్రాత్‌, సోఫీ ఎకిల్‌స్టోన్‌ తలో వికెట్ పడగొట్టారు.

మొదటి రెండు ఓవర్లపాటు నెమ్మదిగా ఆడిన మెగ్ లానింగ్..  మూడో ఓవర్‌ నుంచి దూకుడు పెంచింది. మూడో ఓవర్‌లో ఓ సిక్సర్‌ బాదిన ఆమె.. షబ్నిమ్ వేసిన ఐదో ఓవర్‌లో ఒక ఫోర్‌, రెండు సిక్స్‌లు కొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన తర్వాతి ఓవర్‌లో మూడు బౌండరీలు బాదింది. మొదటి వికెట్‌కు షెఫాలీతో కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. మెక్‌గ్రాత్‌ వేసిన ఏడో ఓవర్‌లో షెఫాలీ.. కిరణ్ నవ్‌గిరెకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ఎకిల్ స్టోన్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో సిక్సర్ బాది మెగ్ లానింగ్ అర్ధ శతకం పూర్తి చేసుకుంది. ఆమె 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసింది. దూకుడుగా ఆడుతున్న లానింగ్‌ను రాజేశ్వరి గైక్వాడ్ ఔట్‌ చేసింది. ఆఖర్లో జెమీమా, జోనాస్సెన్ యూపీ బౌలర్లను ఊచకోత కోశారు. ముఖ్యంగా జోనాస్సెన్‌ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి జట్టు స్కోరు 200 దాటడంతో ప్రధాన పాత్ర పోషించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని