గబ్బర్‌ రెండో శతకం: పంజాబ్‌ లక్ష్యం 165

గబ్బర్‌.. మళ్లీ విజృంభించాడు. దుబాయ్‌ మైదానంలో శతకంతో గర్జించాడు. ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు బాదిన ఏకైక..

Updated : 20 Oct 2020 22:01 IST

దుబాయ్‌: గబ్బర్‌.. మళ్లీ గర్జించాడు. దుబాయ్‌లో శతకంతో విజృంభించాడు. ఫామ్‌లో ఉంటే తననెవ్వరూ ఆపలేరని మరోసారి నిరూపించాడు. ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా అవతరించాడు. తన సహచరులు బంతిని టైమింగ్‌ చేసేందుకే ఇబ్బంది పడుతున్న పిచ్‌పై వరుస బౌండరీలు, భారీ సిక్సర్లతో దుమ్మురేపాడు. పంజాబ్‌తో పోరులో ‘స్మార్ట్‌ క్రికెట్‌’తో అలరించాడు. 61 బంతుల్లోనే 12 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీల్లో మిగతా బ్యాటర్లు 59 బంతుల్లో చేసింది 58 పరుగులే. అయినప్పటికీ ఆ జట్టు 20 ఓవర్లకు 164/5తో నిలిచిందంటే కారణం శిఖర్ ధావన్‌. జట్టు స్కోరు 25 వద్దే పృథ్వీ షా (7)ను నీషమ్‌ ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ (14)తో కలిసి గబ్బర్‌ విజృంభించాడు. పవర్‌ప్లే ముగిసే సరికి జట్టును 53/1తో నిలిపాడు.

ఒకవైపు ధావన్‌ దూకుడుగా ఆడుతున్నప్పటికీ  శ్రేయస్, రిషభ్ పంత్‌ (14), స్టాయినిస్‌ (9) విఫలమయ్యారు. పంజాబ్‌ బౌలర్లు విజృంభించడంతో దిల్లీ స్కోరు వేగం తగ్గింది. పడిపోతున్న రన్‌రేట్‌ను పెంచేందుకు అర్ధశతకం తర్వాత గబ్బర్‌ గేరు మార్చాడు. ఓవర్‌కు ఓ బౌండరీ చొప్పున సాధించాడు. 57 బంతుల్లోనే శతకం అందుకొని 18.4 ఓవర్లకు దిల్లీ స్కోరును 150కి చేర్చాడు. ఆఖరి ఓవర్లో షమి చక్కని యార్కర్లతో విరుచుకుపడి 7 పరుగులిచ్చి వికెట్‌ తీయడంతో శ్రేయస్‌ సేన 164/5కు పరిమితం అయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని