Dinesh karthik: ధావన్‌ వన్డే కెరీర్‌పై డీకే కీలక వ్యాఖ్యలు..

శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి ఆటగాళ్లు అదరగొడుతున్న వేళ శిఖర్‌ ధావన్(Shikhar Dhawan) వన్డే కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారనుందని డీకే పేర్కొన్నాడు. 

Published : 12 Dec 2022 11:02 IST

దిల్లీ: బంగ్లాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓపెనింగ్‌ బ్యాటర్‌ శిఖర్‌ ధావన్‌ తన మెరుపులు చూపించలేకపోయాడు. 1-2 తేడాతో టీమ్‌ఇండియా(Team india) ఈ సిరీస్‌ను కోల్పోగా.. ధావన్‌ 7,8, 3 స్కోరుకు మాత్రమే పరిమితమయ్యాడు. ఇదే సిరీస్‌లో రోహిత్‌ స్థానంలో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ ద్విశతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌(Dinesh karthik) మాట్లాడుతూ ధావన్‌ వన్డే కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘శ్రీలంకతో జరగనున్న సిరీస్‌లో ధావన్‌కు ఏ స్థానం ఇస్తారు? ఇషాన్‌ కిషన్‌ వంటి ఆటగాడిని ఎలా తప్పిస్తారు? అదెలా చేస్తారనేది ఆసక్తికరం. శుభ్‌మన్‌ గిల్‌ సైతం అద్భుతంగా ఆడుతున్నాడు. రోహిత్‌ అందుబాటులోకి వస్తే ఎవరో ఒకరు జట్టుకు దూరం కావాల్సి ఉంటుంది. నాకు తెలిసి అది ధావనే అవుతాడు. అదే జరిగితే.. అతడి అద్భుతమైన కెరీర్‌కు బాధాకరమైన ముగింపు తప్పదేమో. అయితే, ఈ విషయంలో సెలక్టర్లు స్పందించాల్సి ఉంది’’ అని డీకే తెలిపాడు. 

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ 2023 ముంగిట తుది జట్టులో శిఖర్‌ ధావన్‌(Shikhar dhawan)కి చోటు దక్కడం కష్టమేనంటూ డీకే పేర్కొన్నాడు. ‘‘శుభ్‌మన్‌ గిల్‌ జట్టులో ఉంటే కచ్చితంగా ఓపెనర్‌గా ఆడతాడు. ఎందుకంటే, కొంతకాలంగా అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక ఇషాన్‌ కిషన్‌ తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టాడు. గొప్పగా రాణించాడు. ఈ రెండు అంశాలు శిఖర్‌ ధావన్‌కు అవకాశాలను దూరం చేయొచ్చు’’ అని వివరించాడు. ధావన్‌ ఇప్పటివరకూ కేవలం వన్డేల్లోనే ఆడుతున్నాడు. టీ20లు, టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రం సెలక్టర్లు ఇతడిని దూరం పెడుతూ వస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని