Cricket News: ఫైనల్‌కు 59 మిలియన్ల వ్యూస్‌.. పాక్‌ చీఫ్‌ సెలక్టర్‌గా వాహబ్‌.. రాజకీయాల్లోకి షకిబ్!

అంతర్జాతీయంగా క్రికెట్‌, క్రికెటర్ల విశేషాలు మీ కోసం..

Published : 20 Nov 2023 17:29 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) సంగ్రామం ముగిసింది. ఆదివారం భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. దీనిని రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. మెగా టోర్నీలో పాక్‌ లీగ్ స్టేజ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ చీఫ్‌ సెలెక్టర్‌ను తప్పించి కొత్తగా మరొకరిని పీసీబీ నియమించింది. ఇక బంగ్లా కెప్టెన్  షకిబ్ రాజకీయాల్లోకి వచ్చేశాడు. ఇలాంటి విశేషాలు మీ కోసం.. 

వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌.. డిస్నీ హాట్‌స్టార్‌ రికార్డు

వన్డే ప్రపంచ కప్‌ అంటే రికార్డులకు వేదిక. అలాంటి వ్యూవర్స్‌లోనూ దూసుకుపోయింది. భారత్-ఆసీస్‌ జట్ల (IND vs AUS) మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ను దాదాపు 5.9 కోట్ల మంది వీక్షించారు. దీంతో టీమ్‌ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీస్‌ను 5.3 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. ఇప్పుడా రికార్డును ఫైనల్‌ మ్యాచ్‌ అధిగమించేసింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచి కప్‌ను దక్కించుకుంది. మ్యాచ్‌ మరింత ఉత్కంఠగా మారి ఉంటే వ్యూస్‌ కూడా భారీగా వచ్చే అవకాశం ఉండేది.


పాక్‌ చీఫ్‌ సెలెక్టర్‌గా వాహబ్‌ రియాజ్‌

వన్డే ప్రపంచ కప్‌లో పాక్‌ ఘోర ప్రదర్శనతో లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైంది. దీంతో చీఫ్‌ సెలెక్టర్‌గా ఉన్న ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తప్పించింది. అతడి స్థానంలో వాహబ్ రియాజ్‌ను చీఫ్ సెలక్టర్‌గా నియమించింది. 38 ఏళ్ల వాహబ్‌ రియాజ్‌ పాకిస్థాన్‌ మాజీ క్రికెటరే. ఆ జట్టు తరఫున అంతర్జాతీయంగా 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. చివరిసారిగా 2020లో మ్యాచ్‌ ఆడాడు. ఈఏడాది ఆగస్టులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం గమనార్హం. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే చీఫ్‌ సెలక్టర్ పదవి దక్కించుకున్నాడు. 


రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షకిబ్

వరల్డ్‌ కప్‌లో బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన షకిబ్ అల్‌ హసన్ కొత్త అవతారం ఎత్తాడు. రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశాడు. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాడు. బంగ్లాదేశ్‌ అవామీ లీగ్ (BAL) తరఫున నామినేషన్‌ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను తీసుకున్నట్లు బీఏఎల్‌ సంయుక్త కార్యదర్శి బహుద్దిన్ నసీమ్‌ వెల్లడించారు. అయితే, ఆ ఎన్నికలను అక్కడి ప్రతిపక్ష పార్టీలు బహిష్కరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికార పార్టీ తరఫున షకిబ్‌ అభ్యర్థిత్వాన్ని బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని