Ravi Shastri: శిఖర్ ధావన్‌కు తగిన గుర్తింపు దక్కడం లేదు: రవిశాస్త్రి

టీమ్‌ఇండియా బ్యాటర్‌ శిఖర్‌ ధావన్‌ ఆటతీరుకు తగిన విధంగా గుర్తింపు దక్కట్లేదని భారత మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. 

Published : 26 Nov 2022 01:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియాకు శిఖర్ ధావన్‌ నాయకత్వం వహిస్తున్నాడు. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్‌పై కివీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 307 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్‌ 47.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (72) రాణించాడు. ఈ నేపథ్యంలో ధావన్‌పై టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ ఆటతీరుకు తగిన విధంగా గుర్తింపు దక్కట్లేలేదన్నాడు.    

‘ధావన్‌ చాలా అనుభవజ్ఞుడు. అతడికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు. నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఎక్కువ దృష్టి ఉంది. కానీ, ధావన్‌ వన్డే క్రికెట్ రికార్డు‌, ముఖ్యమైన మ్యాచ్‌ల్లో అగ్రశ్రేణి జట్లపై అతడు ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌లు చూడండి. ఇది అద్భుతమైన రికార్డు. ధావన్‌ సహజంగానే దూకుడైన ఆటగాడు. ఫాస్ట్ బౌలింగ్‌ను బాగా ఎదుర్కొంటాడు. ఫుల్, కట్, డ్రైవ్ వంటి షాట్లు ఆడతాడు. బంతి బ్యాట్‌ మీదికి రావడాన్ని ఇష్టపడతాడు. అతడి అనుభవం ఈ సిరీస్‌లో ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ధావన్‌ చుట్టూ చాలా మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లున్నారు. కానీ,  వన్డే ఫార్మాట్‌లో అతని అనుభవానికి విలువ ఉంటుందని భావిస్తున్నా’ అని రవిశాస్త్రి వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని