Rahul - Virat: టీ20ల్లో విరాట్ స్థానంపై ప్రశ్నలు.. ద్రవిడ్‌ సూటిగా సమాధానం

న్యూజిలాండ్‌తో మూడో వన్డే కోసం (IND vs NZ) భారత్‌ (Team India) సిద్ధమైంది. క్లీన్‌స్వీప్‌ దిశగా సాగుతోంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కీలక విషయాలను వెల్లడించాడు.

Updated : 24 Jan 2023 10:51 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గతేడాది ఆసియా కప్‌ నుంచి అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం  న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు మినహా.. ఈ ఏడాది శ్రీలంకపై రెండు శతకాలు సాధించాడు. ఇవాళ కివీస్‌పైనా రాణించాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో బీసీసీఐ యువకులకు పెద్దపీట వేస్తుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే.. టీ20ల్లోనూ మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ పరిస్థితిపై అభిమానులు కంగారుపడుతున్నారు. 

తాజాగా కివీస్‌తో మూడో వన్డే సందర్భంగా టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడాడు. గత ప్రపంచకప్‌ తర్వాత నుంచి ఒక్క టీ20 సిరీస్‌లోనూ కోహ్లీ ఆడలేదని, అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారిందని ఓ విలేకరి అడగ్గా.. రాహుల్‌ మధ్యలో కలగజేసుకొని సమాధానం ఇచ్చాడు. ‘‘అదేం కాదు. అసలు అతడిని తప్పించాలనే ఉద్దేశం అస్సల్లేదు. మా వల్ల కాదు’’ అని స్పందించాడు.

‘‘నిర్దిష్ట సమయాల్లో కొన్ని సిరీస్‌లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే నెలలో బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌కు అర్హత సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే వన్డే ప్రపంచకప్‌ ఉంది. గత ప్రపంచకప్‌ తర్వాత ఇవే ప్రాధాన్యత కలిగిన గేమ్‌లుగా మేం భావించాం. మరొక విషయం ఏంటంటే వన్డేలన్నింటినీ ఆడాడు. అయితే వచ్చే వారం టీ20 మ్యాచ్‌లకు మాత్రం రోహిత్‌తోపాటు కోహ్లీ మరో ఇద్దరు సీనియర్లు విశ్రాంతి తీసుకొంటారు. ఆస్ట్రేలియా ఇక్కడ పర్యటించే సమయానికి ఆటగాళ్లను తాజాగా ఉంచాలనేదే మా అభిమతం. ఇదే మా ప్రాధాన్యత’’ అని రాహుల్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని