IPL కోసం బీసీసీఐ అడగలేదు: ఈసీబీ

కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ను నిర్వహించేందుకు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో మార్పులు చేయమని బీసీసీఐ తమని అధికారికంగా కోరలేదని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు శుక్రవారం స్పష్టం చేసింది...

Published : 21 May 2021 20:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ను నిర్వహించేందుకు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో మార్పులు చేయమని బీసీసీఐ తమని అధికారికంగా కోరలేదని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు శుక్రవారం స్పష్టం చేసింది. ఈ సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను బీసీసీఐ సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టును ముందుగా నిర్వహించాలని భారత క్రికెట్‌ బోర్డు.. ఇంగ్లాండ్‌ బోర్డును కోరే అవకాశాలున్నాయని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. అయితే భారత్‌ నుంచి అలాంటి ప్రతిపాదనలేవీ రానందున షెడ్యూల్‌ ప్రకారమే టెస్టు సిరీస్‌ నిర్వహిస్తామని ఈసీబీ వెల్లడించింది.

‘మేం తరచూ అనేక విషయాలపై బీసీసీఐతో మాట్లాడతాం. ముఖ్యంగా ఈ మధ్య కొవిడ్‌-19 పరిస్థితుల గురించి బాగా చర్చిస్తున్నాం. అయితే ఇప్పటివరకు టెస్టు సిరీస్‌లో మార్పుల గురించి మమ్మల్ని సంప్రదించలేదు. దాంతో మేం ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారమే  సాగుతున్నాం’ అని ఓ ఈసీబీ ప్రతినిధి అన్నారు. ఇక ఇటీవల ఐపీఎల్‌ బయో బుడగలో పలు కరోనా కేసులు నమోదవ్వడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దాంతో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించకపోతే బీసీసీఐకి సుమారు రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంగ్లాండుతో టెస్టు సిరీస్‌ను కాస్త ముందుకు జరపాలని భారత యాజమాన్యం వారిని సంప్రదించిందని ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు మైఖేల్‌ అథర్టన్‌ ఓ పత్రికలో పేర్కొన్నాడు. ఈ విషయంపై బీసీసీఐని సంప్రదించగా ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, అయితే ఈసీబీని మాత్రం అధికారికంగా సంప్రదించలేదని ఒక అధికారి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు