Ravindra Jadeja: జడ్డూ.. నువ్వు మాతో ఉండటం ఎనిమిదో వండర్‌.. చెన్నై ట్వీట్‌ వైరల్‌

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను చెన్నై జట్టులో కొనసాగించడంపై అనుమానాలు రేకెత్తాయి. అయితే వీటికి తెరదించుతూ యాజమాన్యం తమ వద్ద అట్టిపెట్టుకునే జాబితాలో అతడిని చేర్చింది.

Updated : 16 Nov 2022 11:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  చెన్నై జట్టు యాజమాన్యంతో విభేదాల కారణంగా రవీంద్ర జడేజా ఇక ఆ జట్టులో ఉండటం కష్టమే అని అందరూ అనుకున్నారు. అయితే.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ జట్టు ఈ ఆల్‌రౌండర్‌ని అట్టిపెట్టుకుంది. గత సీజన్‌ మొదట్లో జడేజాకు సారథ్య బాధ్యతలను అప్పగించింది యాజమాన్యం. కానీ, వరుస పరాజయాల నేపథ్యంలో.. అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జడేజాను తొలగించి తిరిగి ధోనీకే కెప్టెన్‌ బాధ్యతలను అప్పగించారు. అయినప్పటికీ జట్టు భవితవ్యం ఏ మాత్రం మారలేదు. పేలవ ప్రదర్శనతో ఆ జట్టు నాకౌట్‌ దశకు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. గాయం కారణంగా జడేజా గత సీజన్‌ను పూర్తిగా ఆడలేదు.

ఈ నేపథ్యంలో జడేజాను జట్టులో కొనసాగించడంపై అనుమానాలు రేకెత్తాయి. ఆ తర్వాత జడ్డూ కూడా తన సోషల్‌మీడియా ఖాతాలో చెన్నై జట్టుతో ఉన్న ఫొటోలను తొలగించడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది. అయితే వీటికి తెరదించుతూ యాజమాన్యం తాము రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో జడేజాను చేర్చింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో పంచుకుంటూ.. ‘మాతో ఉండటం ఎనిమిదో వండర్‌’ అంటూ జడేజా ఫొటోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఇక జట్టు సాధించిన ఎన్నో అద్భుత విజయాల్లో భాగమైన ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావోను చెన్నై వదులుకుంది.

ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లను కొనసాగించే, వదిలేసే తుది జాబితాను ఇచ్చేందుకు గడువు మంగళవారంతో ముగిసింది. కొనసాగించనున్న ఆటగాళ్ల వివరాలను అన్ని ఫ్రాంఛైజీలు వెల్లడించాయి. టీ20 లీగ్‌ మినీ వేలం డిసెంబరు 23న కోచిలో జరగనుంది.

చెన్నై తుది జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డేవన్ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్, అంబటి రాయుడు, శుభ్రాన్షు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముకేశ్‌ చౌదరి, సిమర్‌జీత్ సింగ్, తుషార్‌ దేశ్‌పాండే, రాజ్‌వర్థన్ హంగర్గేకర్, మిచెల్ సాంట్నర్, మహీషా పతిరాన

వదిలేసిన ఆటగాళ్ల జాబితా : బ్రావో, ఆడమ్‌ మిల్నే, క్రిస్‌ జోర్డాన్‌, ఎన్‌. జగదీశన్‌, హరి నిషాంత్‌, భగత్‌ వర్మ, ఆసిఫ్‌, రాబిన్‌ ఉతప్ప


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని