T20 Worldcup: అలా కోరుకున్న జట్టే కప్‌ గెలుస్తుంది.. అదే ఈ ఆటలో మ్యాజిక్: ఏబీడీ

టీ20 ప్రపంచకప్‌ తుది పోరులో గెలిచే జట్టుపై దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Updated : 13 Nov 2022 14:07 IST

దిల్లీ: భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్‌ జట్టు పాకిస్థాన్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే టీ20 ప్రపంచకప్‌ తుది పోరులో గెలిచే జట్టుపై దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్‌ జట్టు కచ్చితంగా కప్‌ గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. కానీ ఆట తీరుతెన్నులు తెలిసిన వాడిగా అదంత తేలిక కాదన్నాడు. ఈ మ్యాచ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలంటూ జోస్‌ బట్లర్‌ నేతృత్వంలోని జట్టును పరోక్షంగా హెచ్చరించాడు.

‘‘ఇంగ్లాండ్‌ జట్టు ఎలాగైనా ప్రపంచకప్‌ గెలవాలి. కానీ అదంత తేలికేమీ కాదు. ఎవరైతే గెలవాలని బలంగా నిర్ణయించుకున్నారో.. వారినే ఈ ట్రోఫీ వరిస్తుందేమో ఎవరికి తెలుసు?. అదే ఈ ఆటలోని అద్భుతం’’ అంటూ ఈ మిస్టర్‌ 360 పేర్కొన్నాడు. గతంలోనూ ఈ మాజీ ఆటగాడు ప్రపంచకప్‌లో భారత్‌- పాక్‌ ఫైనల్‌కు చేరుకుంటాయని అంచనా వేశాడు. కాగా 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన టీమ్‌ఇండియా నిరాశతో వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆదివారం మెల్‌బోర్న్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో పాక్‌ తలపడనుంది. వర్షం ముప్పు పొంచివున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు నిబంధనలను సడలిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఆట రిజర్వ్‌ డేకు వెళ్లి మరింత సమయం కావాల్సి వస్తే.. రిజర్వ్‌ డే ఆటకు మరో రెండు గంటలు అదనంగా కేటాయిస్తామని ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు