టీ20 ప్రపంచకప్‌ జట్టేదో ఇంగ్లాండ్‌ సిరీసులో తేలుద్ది!

టీ20 ప్రపంచకప్‌లో ఆడబోయే టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌ సిరీసులో అవగాహన వస్తుందని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. ఐదు టీ20లు ముగిసేలోపు ఒక అంచనా లభిస్తుందన్నాడు. మ్యాచులు గెలుస్తున్నంత వరకు ఆటగాళ్ల స్ట్రైక్‌రేట్లతో ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశాడు...

Published : 11 Mar 2021 01:33 IST

టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో ఆడబోయే టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌ సిరీసులో అవగాహన వస్తుందని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. ఐదు టీ20లు ముగిసేలోపు ఒక అంచనా లభిస్తుందన్నాడు. మ్యాచులు గెలుస్తున్నంత వరకు ఆటగాళ్ల స్ట్రైక్‌రేట్లతో ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశాడు. నిజానికి తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడే స్ట్రైక్‌రేట్‌తో అవసరమని వెల్లడించాడు. అక్టోబర్‌-నవంబర్లో టీ20 ప్రపంచకప్‌నకు భారత్‌ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.

‘పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ భారత్‌లోనే జరుగుతుంది. అందుకే టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ త్వరగా స్థిరపడాలని కోరుకుంటున్నా. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ ముగిసే సరికి ప్రపంచకప్‌లో ఆడే జట్టుపై మనకు అవగాహన రావాలి. ఈ సిరీసులో అది సాధ్యమవుతుందనే అనుకుంటున్నా. ప్రస్తుతానికి జట్టు దాదాపుగా స్థిరపడటంతో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఫామ్‌ కోల్పోతే, గాయపడితే, బ్యాటింగ్‌ విభాగంగా ఇప్పుడే స్థిరత్వం సాధించాలని కోరుకుంటున్నా’ అని విక్రమ్‌ తెలిపాడు.

ఇంగ్లాండ్‌లాగే దూకుడైన క్రికెట్‌ ఆడాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా ‘మ్యాచుల్ని గెలిపించడం ముఖ్యం. నిజానికి ఛేదన చేస్తున్నప్పుడు స్ట్రైక్‌రేట్‌కు అర్థం లేదు. లక్ష్యాన్ని చూసి 10 లేదా 20 ఓవర్లలో ముగిస్తారా అన్నది నిర్ణయించుకోవాలి. మ్యాచును గెలిపించాలి. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు, పరిస్థితులు బాగుంటే వేగంగా ఆడాలి’ అని విక్రమ్‌ పేర్కొన్నాడు.

‘టీ20 బ్యాటింగ్‌ విషయానికొస్తే మేం నిలకడగా ఆడుతున్నాం. అందుకే దానిపై అతిగా ఆందోళన చెందడం లేదు. మనం గెలుస్తున్నంత వరకు, లక్ష్యాలను ఛేదిస్తున్నంత వరకు, భారీ లక్ష్యాల్ని నిర్దేశిస్తున్నంత వరకు ఎలాంటి స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నారన్నది ప్రధానం కాదు’ అని రాఠోడ్‌ అన్నాడు. శుక్రవారం నుంచి భారత్, ఇంగ్లాండ్‌ పొట్టి క్రికెట్‌ సిరీసులో తలపడుతున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని