CSK in Final: ధోనీ ఏది తాకినా.. అదంతా బంగారమైపోతుంది: సురేశ్ రైనా

ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్‌లో విజేతగా నిలిచే జట్టుతో టైటిల్‌ కోసం చెన్నై తలపడనుంది.

Updated : 24 May 2023 15:41 IST

ఇంటర్నెట్ డెస్క్: కీలకమైన ప్లేఆఫ్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ఛాంపియన్‌ గేమ్‌ను ఆడింది. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను (GT vs CSK) ఓడించిన చెన్నై ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) ఫైనల్‌కు చేరింది. ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలోని సీఎస్‌కే పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో లీగ్‌ స్టేజ్‌ను ముగించింది. అయితే, ప్రస్తుత సీజన్‌ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలోనే ఓడిపోయి టోర్నీని ఆరంభించిన చెన్నై తాజాగా విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. సీఎస్‌కే ఫైనల్‌కు చేరడంతో మాజీలు శుభాకాంక్షలు తెలిపారు. ధోనీ ఒకప్పటి సహచరుడు, టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు సురేశ్‌ రైనా, ఇర్ఫాన్‌ పఠాన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ తదితరులు ధోనీసేనను అభినందించారు. 

అతడి వల్లే సాధ్యం: వీరేంద్ర సెహ్వాగ్‌

‘‘చెన్నై సూపర్‌ కింగ్స్‌ను అద్భుతంగా నడిపించడంలో ధోనీకి మరెవరూ సాటిరారు. కేవలం ధోనీ మాత్రమే సీఎస్‌కేను ఫైనల్స్‌కు చేర్చగల సమర్థుడు. అందుకే చెన్నైని గొప్ప జట్టుగా అభివర్ణించా. సీఎస్‌కే అభిమానుల నుంచి భారీ స్థాయిలో మద్దతు రావడానికి కూడా కారణం ధోనీ నాయకత్వం’’ అని సెహ్వాగ్‌ తెలిపాడు.

గొప్ప అచీవ్‌మెంట్: రైనా

‘‘పద్నాలుగు సీజన్లలో 10 సార్లు ఫైనల్స్‌కు చేరుకోవడం అద్భుతం. ఇది గొప్ప అచీవ్‌మెంట్. ఎంఎస్ ధోనీ సునాయాసంగా జట్టును నడిపించాడు. ధోనీ కోసం ఎలాగైనా  టైటిల్‌ను నెగ్గాలని భావిస్తున్నట్లు రుతురాజ్ గైక్వాడ్ నాతో చెప్పాడు. దేశం మొత్తం కూడా ధోనీ మళ్లీ ఐపీఎల్‌ టైటిల్‌ను గెలవాలని ఎదురు చూస్తోంది. ఎంఎస్ ధోనీ ఏది తాకినా అది బంగారం అయిపోతుంది. చెపాక్‌లో సీఎస్‌కేను అడ్డుకోవడం చాలా కష్టం. ప్రత్యర్థులు చాలా శ్రమించాల్సి ఉంటుంది’’ అని రైనా వ్యాఖ్యానించాడు. 

చెపాక్‌లో ధోనీకిదే చివరిది కాదు: ఇర్ఫాన్‌

సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు చెబుతాడని అంతా భావిస్తున్న వేళ.. ఇర్ఫాన్‌ పఠాన్‌ సూపర్‌ ట్వీట్‌ చేశాడు. మరికొన్నేళ్లు తప్పకుండా ఆడతాడనే అర్థంలో ట్వీట్ పెట్టాడు. ‘‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ఉండటం వల్ల.. ధోనీకిది చెపాక్‌లో చివరి మ్యాచ్‌ కాదనే ఆశాభావంతో ఉన్నా’’ అని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని