IPL 2023: ఐపీఎల్‌ ఆల్‌టైమ్‌ ‘XI’.. కెప్టెన్సీపై చర్చ.. ఓజా ఎంపిక ఎవరంటే?

ఐపీఎల్ (IPL) గత పదిహేనేళ్లుగా భారత్‌తోపాటు ప్రపంచదేశాల్లోని క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగుల్లో ముందుంటుంది. ఇన్నేళ్ల నుంచి జరుగుతున్న మెగా టోర్నీకి సంబంధించి త్వరలో మరో సీజన్‌ రాబోతోంది.

Published : 28 Jan 2023 17:26 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌ లీగ్‌ (IPL)లో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఆయా ఫ్రాంచైజీలు టైటిళ్లను సొంతం చేసుకొన్నాయి. రోహిత్ కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ (MI) ఐదుసార్లు విజేతగా నిలిచింది. ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) నాలుగుసార్లు టైటిల్‌ను సొంతం చేసుకొంది. దీంతో ఐపీఎల్‌ అత్యుత్తమ తుది జట్టుకు సారథిగా ఎవరు ఉంటారనే చర్చకు తెరలేసింది. ఐపీఎల్‌ - 2023 మెగా టోర్నీ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో.. పలువురు మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓజా, రాబిన్ ఉతప్ప, ఆకాశ్‌ చోప్రా, సురేశ్‌ రైనా, ఆర్‌పీ సింగ్‌, పార్థివ్‌ పటేల్ తదితరులు తమ ఆల్‌టైమ్ ఫైనల్‌ టీమ్‌ను ఎంచుకొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా ఎవరుంటారనే దానికి ప్రజ్ఞాన్ ఓజా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌ అత్యుత్తమ జట్టుకు కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేసుకోవాలనేది మిలియన్ డాలర్ల ప్రశ్నేనని ఓజా తెలిపాడు. అయితే తాను మాత్రం ఎంఎస్ ధోనీ కంటే రోహిత్ శర్మ వైపే మొగ్గు చూపుతున్నట్లు చెప్పాడు. ‘‘ఒకరితో మరొకరిని పోల్చడం కొంచెం కష్టమే. వారిద్దరి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరూ బౌలర్లకు అనుకూలమైన సారథులు. అయితే నేను ఇప్పుడు కేవలం రోహిత్, ధోనీ సాధించిన టైటిళ్లను బట్టే నిర్ణయం తీసుకొంటున్నా. ఎంఎస్‌డీ కంటే రోహిత్‌ ఎక్కువ కప్‌లను గెలిచాడు. ఆల్‌టైమ్ గ్రేట్‌ గురించి మాట్లాడేటప్పుడు.. 15 ఏళ్ల వ్యవధిలో ఐదు టైటిళ్లను సాధించడం మామూలు విషయం కాదు’’ అని వెల్లడించాడు. 

ఓపెనర్లుగా క్రిస్ గేల్‌, విరాట్ కోహ్లీని ఎంపిక చేసుకోగా.. వన్‌డౌన్‌లో కేఎల్ రాహుల్‌ అయితే సరిపోతాడని ఓజా తెలిపాడు. అయితే ఓజా వ్యాఖ్యలను మరో మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప మాత్రం అంగీకరించలేదు. రాహుల్‌ ఇంకా ఈ స్థానంలో ఎక్కువగా ఆడింది లేదని, అందుకే అతడిని ఎంపిక చేయడం తొందరపాటే అవుతుందని ఉతప్ప చెప్పాడు. మూడో స్థానంలో సురేశ్‌ రైనా, రోహిత్ శర్మ నాలుగు, ఏబీ డివిలియర్స్‌ ఐదు, ఎంఎస్ ధోనీ ఆరో స్థానంలో ఆడితే బాగుంటుందని తెలిపాడు. బౌలర్ల విషయానికొస్తే లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్‌, హర్భజన్ సింగ్, డ్వేన్ బ్రావో మిగతా స్థానాల్లో ఉంటారని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని