Fastest fifties: ధనాధన్‌ బ్యాటింగ్‌.. ఈ సీజన్‌లో వేగవంతమైన అర్ధశతకాలివే..!

భారత టీ20 లీగ్‌లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. చెన్నై, ముంబయి మినహా అన్ని జట్లూ ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాయి...

Published : 16 Apr 2022 09:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. చెన్నై, ముంబయి మినహా అన్ని జట్లూ ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు బ్యాట్స్‌మన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగుతున్నారు. అలా ఇప్పటివరకు వేగవంతమైన అర్ధశతకాలు సాధించిన టాప్‌ 10 బ్యాట్స్‌మెన్‌ ఎవరో ఓ లుక్కేద్దాం..


* ప్యాట్‌ కమిన్స్‌: కోల్‌కతా ఆటగాడు ప్యాట్‌ కమిన్స్‌ ముంబయితో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకొని ఈ సీజన్‌లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ సాధించాడు. అదే సమయంలో ఈ లీగ్‌ చరిత్రలో 14 బంతుల్లోనే ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కేఎల్‌ రాహుల్‌ 2018లో తొలిసారి ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్‌ 4 ఫోర్లు, 6 సిక్సర్లు సాధించి మొత్తం 56 పరుగులు చేసి కోల్‌కతాను గెలిపించాడు.


* రాహుల్‌ త్రిపాఠి: హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. దీంతో ఈ సీజన్‌లో రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అందులో 4 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.


* లియామ్‌ లివింగ్‌స్టోన్‌: పంజాబ్‌ ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ కూడా 21 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. దీంతో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతడు 7 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. మొత్తం 64 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ గెలవడం కొసమెరుపు.


* జోస్‌బట్లర్‌: రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ ఈ సీజన్‌లో జోరుమీదున్నాడు. ఇప్పటికే ఒక శతకం, రెండు అర్ధశతకాలతో టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే గుజరాత్‌తో ఆడిన మ్యాచ్‌లో 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు దంచికొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 54 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ విజయం సాధించింది.


* ఎవిన్‌ లూయిస్‌: లఖ్‌నవూ ఆటగాడు ఎవిన్‌ లూయిస్‌ సైతం 23 బంతుల్లోనే ఈ సీజన్‌లో వేగవంతమైన అర్ధశతకం సాధించాడు. చెన్నైతో తలపడిన మ్యాచ్‌లో అతడు దంచికొట్టి ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. అందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు సంధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి తన జట్టును గెలిపించాడు.


* సంజూ శాంసన్‌: రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఈ సీజన్‌లో 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసి ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అందులో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మొత్తం 55 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ విజయం సాధించింది.


* రాబిన్‌ ఉతప్ప: ఇప్పటివరకు జరిగిన సీజన్‌లో చెన్నై పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఉతప్ప మంచి ఫామ్‌లో ఉన్నాడు. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో అతడు 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించి ఔటయ్యాడు. దీంతో ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. అందులో మొత్తం 8 ఫోర్లు, 1 సిక్సర్‌ సాధించాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై 210 పరుగుల భారీ స్కోర్‌ చేసినా ఓటమిపాలైంది.


* శివమ్‌దూబే: మరో చెన్నై ఆటగాడు శివమ్‌దూబే. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అతడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. దీంతో ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు దంచికొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో దూబే 57 పరుగులు చేశాడు. ఇక్కడ కూడా చెన్నై ఓటమిపాలవ్వడం గమనార్హం.


* పృథ్వీషా: దిల్లీ ఓపెనర్‌ పృథ్వీషా ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. కోల్‌కతాతో ఆడిన మ్యాచ్‌లో అతడు 27 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. అందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు నమోదు చేశాడు. మొత్తం 51 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో దిల్లీ 215 పరుగుల భారీ స్కోర్‌ చేయగా కోల్‌కతా అంత మొత్తం ఛేదించలేక ఓటమిపాలైంది.


* ఆండ్రీ రసెల్‌: కోల్‌కతా సూపర్‌ హిట్టర్‌ ఆండ్రీ రసెల్ ఈ జాబితాలో పదో స్థానంలో ఉన్నాడు. అతడు పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అందులో 2 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం విశేషం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి కోల్‌కతాను గెలిపించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని