చెన్నై టెస్టుకు 50 శాతం ప్రేక్షకులు!

భారత్×ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్టులో ప్రేక్షకుల అనుమతికి బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. 50 శాతం సామర్థ్యంతో....

Published : 01 Feb 2021 22:36 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత్×ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్టులో ప్రేక్షకుల అనుమతికి బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 50 శాతం సామర్థ్యంతో ప్రేక్షకులని అనుమతించనున్నట్లు సమాచారం. ప్రభుత్వం తాజాగా జారీచేసిన కొవిడ్-19 మార్గదర్శకాల నేపథ్యంలో టీఎన్‌సీఏ సభ్యులు ప్రేక్షకుల అనుమతిపై చర్చించారు. బీసీసీఐతో టీఎన్‌సీఏ సమావేశం అనంతరం దానిపై స్పష్టత వచ్చిందని టీఎన్‌సీఏ అధికారి ఒకరు తెలిపారు.

‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తాజా కొవిడ్‌-19 మార్గదర్శకాల నేపథ్యంలో భారత్×ఇంగ్లాండ్ రెండో టెస్టుకు స్టేడియంలో ప్రేక్షకుల అనుమతిపై చర్చించాం. 50 శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాలని బీసీసీఐ, టీఎన్‌సీఏ నిర్ణయించింది. తొలి టెస్టు, రెండో టెస్టుకు మధ్య మూడు రోజుల విరామమే ఉంది. అయినా ఏర్పాట్లన్నీ పూర్తిచేస్తాం’’ అని టీఎన్‌సీఏ అధికారి ఒకరు తెలిపారు. అంతేగాక తొలి టెస్టు నుంచే స్టేడియంలో మీడియాను అనుమతించనున్నారని పేర్కొన్నారు.

మరోవైపు ప్రేక్షకులు లేకుండానే సిరీస్‌ను నిర్వహించాలని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) కోరుతోంది. ప్రేక్షకుల అనుమతి గురించి బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఆ నిర్ణయంపై స్పందిస్తామని ఈసీబీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరోనా విజృంభించిన అనంతరం ‘భారత్‌×ఇంగ్లాండ్‌ సిరీస్’‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌ను దేశంలో బీసీసీఐ పున:ప్రారంభించనుంది. చెన్నైలోని చెపాక్‌ వేదికగా తొలి రెండు టెస్టులు జరగనున్నాయి. చెపాక్‌ స్టేడియం సామర్థ్యం 50 వేలు. చివరి రెండు టెస్టులు అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరగనున్నాయి. కాగా, శుక్రవారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.

ఇవీ చదవండి

కోహ్లీ మాట దాటాలంటే ఆటగాళ్లకు భయం

గావస్కర్‌ రికార్డుపై కోహ్లీ గురి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని