Virat Kohli: విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!

ఆర్సీబీ స్టార్‌ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 క్రికెట్‌లో ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  

Published : 28 Apr 2023 01:32 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) మంచి ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా హాఫ్‌ సెంచరీలు చేస్తూ దూసుకుపోతున్నాడు. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR)తో జరిగిన మ్యాచ్‌లోనూ అర్ధ శతకంతో మెరిశాడు. 37 బంతుల్లో 54 పరుగులు చేసిన అతడు..  జట్టు (RCB)ని  మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. అయితే, ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  టీ20ల్లో ఒకే స్టేడియంలో 3,000 లేదా అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium)లో కోహ్లీ ఇప్పటివరకు 92 ఇన్నింగ్స్‌ల్లో 3,015 పరుగులు చేశాడు.

ఒకే స్టేడియంలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 3,015 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ముష్ఫీకర్‌ రహీమ్, మహ్మదుల్లా ఉన్నారు. మిర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో ముష్ఫీకర్‌ 121 ఇన్నింగ్స్‌ల్లో 2,989 పరుగులు చేయగా.. మహ్మదుల్లా 130 ఇన్నింగ్స్‌ల్లో 2,813 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌ మైదానంలో 90 ఇన్నింగ్స్‌ల్లో 2,749 పరుగులు చేసి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌కు చెందిన మరో ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్ మిర్పూర్‌ స్టేడియంలో 2,706 పరుగులు చేసి ఐదో స్థానంలో నిలిచాడు.

ఇక, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 142.30 స్ట్రెక్‌రేట్‌తో 333 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్‌ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 82*. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ రెగ్యులర్‌ కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్ 422 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని