షాక్‌: ఐసోలేషన్‌కు ఐదుగురు టీమ్‌ ఇండియా క్రికెటర్లు

టీమ్‌ఇండియాకు చెందిన ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్‌కు పంపించారు. మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్లో కలిసి భోజనం చేయడంతో ఇతర క్రికెటర్లతో వారిని దూరంగా ఉంచినట్టు తెలిసింది. పైగా వారు బయోబుడగ నిబంధనలు ఉల్లంఘించారో లేదో క్రికెట్‌ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్టు...

Published : 02 Jan 2021 18:40 IST

బుడగ నిబంధనల ఉల్లంఘనపై బీసీసీఐ, సీఏ దర్యాప్తు

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియాకు చెందిన ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్‌కు పంపించారు. మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్లో కలిసి భోజనం చేయడంతో ఇతర క్రికెటర్లతో వారిని దూరంగా ఉంచినట్టు తెలిసింది. పైగా వారు బయోబుడగ నిబంధనలు ఉల్లంఘించారో లేదో క్రికెట్‌ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

నూతన సంవత్సరం సందర్భంగా రోహిత్‌ శర్మ, రిషభ్ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీషా, నవదీప్‌ సైని మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్‌కు వెళ్లి భోజనం చేశారు. అక్కడే ఉన్న భారత అభిమాని ఒకరు వీరి చిత్రాలు, వీడియోలను తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. వారి బిల్లు కట్టడమే కాకుండా పంత్‌ను కౌగిలించుకున్నానని వ్యాఖ్యానించాడు. ఇది వివాదాస్పదం కావడంతో ఆ అభిమాని క్షమాపణలు కోరాడు. తన డబ్బులను రోహిత్‌ శర్మ చెల్లించాడని తెలిపాడు.

‘ఐదుగురు ఆటగాళ్లను భారత్‌, ఆస్ట్రేలియా జట్ల నుంచి వేరు చేశాం. అయితే కొవిడ్‌-19 నిబంధనలను అనుసరించి వారు సాధన చేస్తారు. భారత, ఆసీస్‌ జట్లలోని మిగతా ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఇలా చేశాం’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. ‘వారు బయటకు వెళ్లినప్పుడు బయోబుడగ నిబంధనల ఉల్లంఘన జరిగిందో లేదో తెలుసుకొనేందుకు బీసీసీఐ, సీఏ దర్యాప్తు చేపట్టాయి. టెస్టు సిరీసు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఐదుగురిని విడదీశాం’ అని వెల్లడించింది.

ప్రస్తుతం బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భారత్‌, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్‌ గెలిచాయి. సిరీసు 1-1తో సమం కావడంతో సిడ్నీలో జరిగే మూడో టెస్టుపై అందరి దృష్టి నెలకొంది. మెల్‌బోర్న్‌తో పోలిస్తే సిడ్నీ నగరంలో కొవిడ్‌ కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దాంతో ఆ నగరంలో ఆంక్షలు ఎక్కవగా ఉన్నాయి. కానీ మెల్‌బోర్న్‌కు సంబంధించినంత వరకు ఆటగాళ్లు బయటకు వెళ్లి ఆహారం తీసుకోవచ్చు. అయితే ఇండోర్‌లో కాకుండా ఔట్‌డోర్‌లో మాత్రమే ఆహార పదార్థాలు భుజించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయంలో స్పష్టత లేదు.

ఇవీ చదవండి
దాదాకు గుండెపోటు
అభిమాని సర్‌ప్రైజ్‌: బాగోదన్న రోహిత్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని