SKY : సూర్యకుమార్‌ను పాంటింగ్‌ అలా పోల్చడం తొందరపాటే అవుతుంది!

ఇటీవల ఓ సందర్భంలో టీమ్‌ఇండియా బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ను దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో ...

Published : 17 Aug 2022 10:31 IST

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ విశ్లేషణ

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల ఓ సందర్భంలో టీమ్‌ఇండియా బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ను దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ పోల్చాడు. ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌ (ఎస్‌కేవై) ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. ఆసియా కప్‌లో రాణిస్తే తొలి ర్యాంకర్‌ బాబర్‌ అజామ్‌ను అధిగమించే అవకాశం సూర్యకుమార్‌కు ఉంది. విండీస్‌తో జరిగిన టీ20 సిరీసులో అన్ని వైపులా షాట్లు కొట్టడంతో పాంటింగ్‌ ఈ విధంగా అభివర్ణించాడు. అయితే ఏబీడీతో సూర్యకుమార్‌ను పోల్చడం తొందరపాటు అవుతుందని పాక్‌ మాజీ సారథి సల్మాన్‌ భట్‌ అభిప్రాయపడ్డాడు. ఏబీడీ వంటి ఆటగాడిని క్రికెట్‌ ప్రపంచంలో చూడలేమని పేర్కొన్నాడు. 

‘‘ఏబీ డిలివియర్స్‌ బ్యాటింగ్ శైలి సూపర్‌గా ఉండేది. ఇలాంటి ఆట అతడికే సొంతం. క్రికెట్‌ చరిత్రలో ఏబీ శైలిలో ఎవరూ ఆడలేరనేది నా అభిప్రాయం. ఏబీని ఔట్‌ చేయకపోతే ఓడిపోతామని ప్రత్యర్థుల బౌలర్లకు తెలుసు. ఇలాంటి కోవలోకి వచ్చేవారే రూట్, విలియమ్సన్‌, కోహ్లీ. ఇక భారత సారథి రోహిత్ శర్మ తనదైన రోజున వన్డేలోనూ 250కిపైగా పరుగులు చేసిన ఘనుడు. ఇటువంటి ఆటగాళ్లు ఉన్న సమయంలో సూర్యకుమార్‌ను ఏబీతో పోల్చడం తొందరపాటు అవుతుంది. ఎందుకంటే ఎస్‌కేవై ఇప్పుడే కెరీర్‌ను ప్రారంభించాడు. అతడు చాలా టాలెంట్ కలిగిన ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయినంతమాత్రాన ఇప్పుడే ఏకంగా ఏబీడీతో పోల్చలేం.  పాంటింగ్‌ కాస్త వేచి చూస్తే బాగుండేది. మెగా టోర్నీల్లో తానేంటో సూర్యకుమార్‌ నిరూపించుకోవాల్సి ఉంది. అంతేకాకుండా ఏబీ వంటి ఆటగాడిని మళ్లీ చూడలేమని కచ్చితంగా చెప్పగలను. ఒకవేళ సూర్యకుమార్‌ను ఎవరితోనైనా పోల్చాలనుకుంటే.. విండీస్ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌తో పోలిస్తే బాగుండేది’’ అని సల్మాన్‌ భట్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని