
భువనేశ్వర్ను తీసుకెళ్లకపోవడం అతిపెద్ద తప్పు
ఇంటర్నెట్డెస్క్: భువనేశ్వర్ కుమార్ లాంటి స్వింగ్ బౌలర్ను ఇంగ్లాండ్ పర్యటనకు తీసుకెళ్లకపోవడం అతిపెద్ద తప్పని, అలాగే ఛాంపియన్షిప్ ఫైనల్కు టీమ్ఇండియా ఎంపిక చేసిన 15 మంది జాబితాలో శార్ధూల్ ఠాకూర్ను తీసుకోవాల్సి ఉందని మాజీ సెలెక్టర్ శరణ్దీప్ సింగ్ అన్నారు. ఇటీవల న్యూజిలాండ్తో తలపడిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం పీటీఐతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై స్పందించాడు. ‘భువనేశ్వర్ కుమార్ను ఇంగ్లాండ్కు తీసుకుకెళ్లకపోవడం అతిపెద్ద తప్పు. భారత జట్టులోని ఉత్తమ స్వింగ్ బౌలర్ అతను. కనీసం ఆ పర్యటనలో ఒకడిగానైనా ఎంపికచేయలేదు. అలాగే శార్ధూల్ను ఫైనల్లో ఆడించలేదు. ఎప్పుడూ ఫాస్ట్బౌలింగ్ ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్పైనే ఆధారపడొద్దు. మూడు ఫార్మాట్లలో అతనెప్పుడు ఫిట్గా తయారవుతాడో, ఎప్పుడు బౌలింగ్ చేస్తాడో తెలియదు. అలాంటప్పుడు శార్ధూల్ లేదా విజయ్ శంకర్ లేదా శివమ్దూబేను తయారు చేయాలి’ అని శరణ్దీప్ పేర్కొన్నారు.
ఇక రాబోయే ఇంగ్లాండ్ సిరీస్లో యువ పేసర్ మహ్మద్ సిరాజ్కు వీలైనన్ని ఎక్కవ అవకాశాలివ్వాలని మాజీ సెలెక్టర్ సూచించారు. ‘ఈ ఐదు టెస్టుల సిరీస్లో ఆటగాళ్ల రొటేషన్ పద్ధతి ఉంటుంది. సిరాజ్కు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడించి ప్రోత్సహించాలి. అతనిప్పుడు బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఒకవేళ అతడికి ఎప్పుడో ఒకసారి అవకాశాలిచ్చి రాణించమంటే ఇబ్బంది పడతాడు. సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయడం కష్టమవుతుంది. రాబోయే సిరీస్లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించినా పరిస్థితులను బట్టి అదనపు పేసర్ను కూడా తీసుకోవాలి’ అని ఆయన అన్నారు. మరోవైపు భారత బౌలింగ్ విభాగం బాగుందని, ఇక్కడ సమస్య బ్యాట్స్మెన్దేనని శరణ్దీప్ అన్నారు. శుభ్మన్ గిల్ స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్లోనూ రాణించలేదని, ఇప్పుడు ఛాంపియన్షిప్ ఫైనల్లో మొదట కాస్త బాగా ఆడినా తర్వాత పెద్ద స్కోర్లు సాధించలేకపోయాడని గుర్తుచేశారు. దాంతో ఇప్పుడతను బాధ్యత తీసుకొని ఒత్తిడిని తట్టుకోవాలని సూచించారు. ఇక పుజారా, అజింక్య రహానె లాంటి ఆటగాళ్లు ఎప్పుడూ ఒకేలా ఆడొద్దని పరిస్థితులకు తగ్గట్టు మారాలని చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెనే కీలక పరుగులు చేశారన్నారు. కోహ్లీ, రోహిత్లపై భారం తగ్గించే ఆటగాళ్లు కావాలని తెలిపారు. చివరగా కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా కొన్నేళ్లుగా బాగా ఆడుతున్నా ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోయిందని చెప్పారు. విజేతగా నిలవడానికి కోహ్లీసేనకు అన్ని అర్హతలున్నా ఏదో ఒక కారణంతో అది జరగడం లేదని వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.