FIFA World Cup: ఫైనల్‌కు ఫ్రాన్స్‌.. సెమీస్‌లో మొరాకో చిత్తు

సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకోను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన సెమీస్‌ పోరులో ఫ్రాన్స్‌ 2-0 తేడాతో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్‌లో మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనాతో తలపడనుంది. 

Updated : 29 Oct 2023 11:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ సెమీస్‌లో అదరగొట్టింది. సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకోను 2-0 తేడాతో చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ జట్టు పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించి ఫైనల్‌లో అడుగిడింది. ఈ విజయంతో మరోసారి కప్పును ఒడిసి పట్టుకునేందుకు ఫ్రాన్స్‌ సిద్ధమైంది. అర్జెంటీనాతో ఆదివారం జరిగే తుది పోరులో తలపడనుంది. ఇక గ్రూప్‌ స్థాయి, నాకౌట్‌ మ్యాచుల్లో బెల్జియం, స్పెయిన్‌, పోర్చుగల్‌ లాంటి బలమైన జట్లనే ఓడించిన మొరాకో ఈ ఫిఫా ప్రపంచకప్‌లో తనకంటూ ఓ చరిత్రను లిఖించుకుంది. ఆఫ్రికా నుంచి సెమీస్‌ చేరిన తొలి జట్టుగా మొరాకో నిలిచింది. 

మ్యాచ్‌లో మూడింట రెండో వంతు బంతి తన నియంత్రణలోనే ఉన్నప్పటికీ గోల్స్‌ చేయడంలో మొరాకో జట్టు విఫలమైంది. మూడు సార్లు మొరాకో ఆటగాళ్లు టార్గెట్ వైపు దూసుకెళ్లినప్పటికీ ఫ్రాన్స్‌ రక్షణశ్రేణిని ఛేదించలేకపోయారు. ఇక మ్యాచ్‌ ప్రారంభమైన 5వ నిమిషంలోనే ఫ్రాన్స్‌ ఆటగాడు థియో హెర్నాండెజ్‌ అద్భుత రీతిలో గోల్‌ చేశాడు. దీంతో ఫ్రాన్స్‌ 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత తొలి అర్ధభాగం ముగిసే వరకు ఇరు జట్లు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. మరోవైపు ఫ్రాన్స్‌ ఆటగాళ్లు పదే పదే మొరాకో గోల్ పోస్టుపై దాడులు చేసినప్పటికీ ఎక్కువ గోల్స్‌ చేయలేకపోయారు. 79 నిమిషాల వద్ద ఎంబపే నుంచి పాస్‌ అందుకున్న రాండల్‌ కోలో మువానీ గోల్‌ చేయడంతో ఫ్రాన్స్‌ జట్టు 2-0 తేడాతో మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక గోల్‌ కోసం చివరిదాకా తీవ్రంగా శ్రమించిన మొరాకో సెమీస్‌లో ఖాతా తెరవకుండానే నిష్క్రమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని