
Mirabai chanu: కేక్, ఐస్క్రీమ్ కాదు.. ముందు పిజ్జా తింటా
ఒలింపిక్స్ కోసం ఇష్టమైన పిజ్జాను పక్కనపెట్టా
ఇంటర్నెట్డెస్క్: లక్ష్యాలను చేరుకోవాలంటే ఇష్టమైనవన్నీ పక్కన పెట్టాలి. ఫోన్లు మాట్లాడటం, స్నేహితులతో ముచ్చట్లు, గంటల తరబడి నిద్ర .. ఇవన్నీ.. ఇక నోరూరించే వంటకాలు.. కళ్ల ముందు ఉన్నా సరే.. చేరుకోవాల్సిన గమ్యమే గుర్తుకు రావాలి. ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో రజతం సాధించిన మీరాబాయ్కి ఇష్టమైన ఓ ఆహారాన్ని నాలుగేళ్లు పక్కన పెట్టేశారు. మరి స్నాచ్లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు బరువు ఎత్తాలంటే మాటలా.. కచ్చితంగా కఠోర ఆహార నియమావళిని పాటించక తప్పదు. తాజాగా జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని మీరా ప్రస్తావించారు. నాలుగేళ్లగా ఒలింపిక్స్ కోసం ఇష్టమైన ఆహారాన్ని పక్కన పెట్టారు.. కేవలం సలాడ్తోనే సరిపెట్టుకున్నారు కదా.. మరి ఇప్పుడు ఇంటికెళ్లి.. ఐస్క్రీమ్, కేక్ తింటానంటే మీ కోచ్ అంగీకరిస్తారని అనుకుంటున్నారా అని ప్రశ్నించిగా .. వెంటనే నవ్వేస్తూ.. ‘‘ పిజ్జా తిని చాలా రోజులైంది. కఠోన సాధనలో భాగంగా ఒక్క పిజ్జా తినలేదు. ముందుగా నేను వెళ్లి చేసేది పిజ్జా తినడమే. కొంచెం కాదు. ఎక్కువే తింటా. ఈరోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా’’ అంటూ సమాధానమిచ్చింది. పిజ్జా పట్ల ఆమెకున్న ఇష్టాన్ని చూసి డామినొస్ పిజ్జా ఆమెకో లైఫ్టైమ్ గిఫ్ట్ ఇచ్చింది. ‘‘ మీరు కోట్లాది భారతీయుల కలల్ని నిజం చేశారు. అభినందనలు మీరా. ఇంతటి ఘనత సాధించిన మీకు మా డామినోజ్ ఇండియా తరఫు నుంచి జీవితకాలం ఉచితంగా పిజ్జా బహుమతిగా ఇస్తున్నాం’’ అని ప్రకటించింది.
కేవలం ఈ సంబరాలు కేవలం డామినోస్తోనే ఆగిపోలేదు. పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ ఇండియా సైతం ఆమె విజయానికి గుర్తుగా మీరా మెడలో రజతం, ఎదురుగా బార్బెల్ ముందు నిలబడ్డ ఓ కార్టూన్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసింది. ‘‘మేరా, తేరా, హమారా ఫేవరేట్ స్నాక్’’ (నాది, మీది, మనందరికి ఇష్టమైన స్నాక్) అంటూ క్యాప్షన్ను జత చేసి.. ఆమెకి అంకితమిస్తున్నట్లు పేర్కొంది..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.